ఆ సమస్యపై సీఎం చంద్రబాబుతో మాట్లాడతా: పురంధేశ్వరి
అమరావతి: అనంతపురం జిల్లాలోని పెనుకొండలో ఉన్న 40 అడుగుల శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాన్ని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత పురందేశ్వరి సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెనుకొండ పట్టణాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
2019 నాటికి ఆంధ్రప్రదేశ్లో బీజేపీని బలోపేతం చేస్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీ అభివృద్ధికి సహకరించడం లేదనేది కేవలం దుష్ప్రచారమేనని ఆమె పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్రమోడీ ఆమోదంతోనే రాష్ట్రానికి 11 కేంద్ర విద్యా సంస్ధలు లభించాయని ఆమె చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతోనే ఏపీకి 24 గంటల విద్యుత్ సరఫరా అవుతుందని ఆమె పేర్కొన్నారు.
వేరుశనగ విత్తనాల కొరతపై చంద్రబాబుతో మాట్లాడుతూ: పురంధేశ్వరి
అనంతపురం జిల్లాలో వేరుశనగ విత్తనాల కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, ఆ సమస్యపై పురంధేశ్వరి స్పందించారు. వేరుశనగ విత్తనాల సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళతానని, ఆయనతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని అన్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశంపై మాట్లాడిన ఆమె ఈ విషయమై కేంద్ర మంత్రిత్వ శాఖలతో చర్చిస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేక హోదాకు 14వ ఆర్ధిక సంఘం సుముఖంగా లేకపోయినా.... తమ ప్రయత్నాలను మాత్రం కొనసాగిస్తామని చెప్పారు.