పవన్ కళ్యాణ్పై పొట్లూరి సంచలనం, జగన్తో తేడా వచ్చింది.. అందుకే
విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన ప్రముఖ పారిశ్రామికవేత్త, సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో పవన్ పార్టీ పెట్టడానికి పీవీపీనే కారణమనే వాదనలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో పీవీపీ తాజాగా చేసినట్లుగా వస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. తామంతా ఓ రాజకీయేతర సంస్థను నడపాలనుకున్నామని, కానీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ దానిని రాజకీయ సంస్థగా మార్చారని పీవీపీ చెబుతున్నారని అంటున్నారు.
పవన్ కళ్యాణ్, తాము అనుకున్నది ఒకటని, ఆయన చేసింది మరొకటి అన్నారని తెలుస్తోంది. దానితో తాను, మరికొందరం మౌనం వహించి పక్కకు తప్పుకున్నామని పీవీపీ అన్నారని అంటున్నారు. తాను గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ద్వారా టిక్కెట్ కోసం యత్నించలేదని స్పష్టం చేశారు.
అసలు ఎన్నికల సమయంలో తాను భారత్లో లేనని చెప్పారు. అదే సమయంలో వైయస్ జగన్ విషయమై కూడా ఆయన మాట్లాడారు. వైయస్ రాజశేఖర రెడ్డి, వైయస్ జగన్మోహన్ రెడ్డితో తనకు సాన్నిహిత్యం ఉందని, జగన్తో ఓ మాట తేడా వచ్చాక మౌనం వహించానని చెప్పారని తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్తో తాను సినిమా తీసే ఆలోచన లేదని తెలిపారు. ప్రభుత్వంతో సంబంధం ఉండే ఏ వ్యాపారం తాను చేయనని చెప్పారు. తాను వైయస్ రాజశేఖర రెడ్డి వల్ల లాభం పొందినట్లు చిన్న ఆధారం చూపించినా, దేనికైనా సిద్ధమేనన్నారు.