పడవ గుర్తుతో పోటీకి 'సై' అంటున్న దీప: గెలిచేదెవరో?, ఆర్కేనగర్ బరిలో 62మంది..
ఉపఎన్నిక బరిలో అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో బ్యాలెట్ ఓటింగ్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలా? లేక ఈవీఎంలను ఉపయోగించాలా? అన్న సందిగ్దంలో ఎన్నికల కమిషన్ తర్జనభర్జన పడింది.
చెన్నై: ఏప్రిల్ 12న జరగబోయే ఆర్కేనగర్ ఉపఎన్నిక తమిళనాట మరో ఆసక్తికర రాజకీయాన్ని తలపిస్తోంది. బరిలో గెలిచినవారు అమ్మకు తామే అసలైన వారసులం అని ప్రకటించుకోవడానికి అవకాశం ఉండటంతో.. గెలుపు కోసం ఎవరి ప్రయత్నాల్లో వారు మునిగిపోయారు.
విజయం ఎవరిని వరిస్తుందో కచ్చితంగా అంచనా వేయలేని పరిస్థితి ఆర్కేనగర్ లో నెలకొంది. కొంతవరకు పన్నీర్ సెల్వం వర్గం పట్ల ప్రజల్లో కొంత సానుభూతి ఉండగా.. మేనత్త జయలలిత పోలికలు దీపకు కలిసొచ్చే అంశం. ఇక అన్నాడీఎంకె అభ్యర్థి దినకరన్ సైతం గెలుపుపై ధీమాగానే ఉన్నారు. మరి ప్రజలు ఎవరికి పట్టం కడుతారన్నది ఎన్నికలు పూర్తయితే గానీ చెప్పలేని పరిస్థితి.
దీపకు పడవ గుర్తు:
జయలలిత మేనకోడలు దీప తాను స్థాపించిన 'ఎంజీఆర్ అమ్మా దీప పేరవై' తరుపున ఆర్కేనగర్ బరిలో దిగుతున్నారు. ఈ నెల 23న నామినేషన్ దాఖలు చేసిన దీపకు ఎన్నికల కమిషన్ పడవ గుర్తు కేటాయించింది. అంతకుముందు కోడిపుంజుతో పాటు మరో మూడు గుర్తులను పరిశీలించిన దీప చివరకు ఎన్నికల సంఘం నిర్ణయానికే కట్టుబడి ఉంటానని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ దీపకు పడవ గుర్తు కేటాయించింది.
టోపీ వర్సెస్ పడవ వర్సెస్ విద్యుత్ స్తంభాలు:
అన్నాడీఎంకె ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ శశికళ వర్గానికి ఈ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ టోపీ గుర్తును కేటాయించిన సంగతి తెలిసిందే. పన్నీర్ సెల్వం వర్గానికి విద్యుత్ స్తంభాల గుర్తును కేటాయించింది. ఇప్పుడు దీపకు పడవ గుర్తు కేటాయించడంతో.. ఈ మూడు గుర్తుల్లో ఏది జనంలోకి బలంగా వెళ్లగలుగుతుందన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
బరిలో 62మంది:
సోమవారం నాటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో 20 మంది అభ్యర్థులు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. దీంతో ఆర్కేనగర్ బరిలో మొత్తం 62మంది పోటీకి మిగిలారు. తొలుత 127 నామినేషన్లు దాఖలవగా.. పరిశీలన అనంతరం 82మంది నామినేషన్లను మాత్రమే అధికారులు ఎన్నికలకు ఆమోదించారు.
బ్యాలెటా? ఈవీఎం ఓటింగా?:
ఉపఎన్నిక బరిలో అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో బ్యాలెట్ ఓటింగ్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలా? లేక ఈవీఎంలను ఉపయోగించాలా? అన్న సందిగ్దంలో ఎన్నికల కమిషన్ తర్జనభర్జన పడింది. చివరకు ఈవీఎంలనే ఉపయోగించాలని నిర్ణయించినట్లుగా సమాచారం.