రాళ్లతో కొట్టిస్తా: ఆర్ కృష్ణయ్య, ఇదేమిటని ఎంపీ గుత్తా ఆగ్రహం
హైదరాబాద్: బీసీల సమస్యల పైన పార్లమెంటులో బీసీకి చెందిన పార్లమెంటు సభ్యులు ప్రశ్నించకుంటే రాళ్లతో కొట్టిస్తామని తెలుగుదేశం పార్టీ ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య సోమవారం హెచ్చరికలు జారీ చేశారు. బీసీ సబ్ప్లాన్ తీసుకురాకుంటే తెలంగాణ రాష్ట్ర సమితికి గుణపాఠం తప్పదన్నారు.
కేసీఆర్ పైన గుత్తా ఆగ్రహం
పంట నష్టపోయిన రైతులను పరామర్శించకుండా మిషన్ కాకతీయ పనులు ప్రారంభించడం ఎంతవరకు సబబని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి సోమవారం ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తీరు సరికాదన్నారు.
ఆయన కల్లబొల్లి కబుర్లు చెబుతూ కాలం గడుపుతున్నారన్నారు. పార్లమెంటరీ సెక్రటరీల నియామకంపై హైకోర్టులో కేసు నడుస్తుండగా మరోవైపు ప్రభుత్వం పార్లమెంటరీ సెక్రటరీల నియామకంపై జీవో విడుదల చేయడమేమిటని ప్రశ్నించారు. అకాల వర్షంతో నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలన్నారు.
పోచారం నేతృత్వంలో ఇజ్రాయెల్ పర్యటన
తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో ఓ బృందం సోమవారం సాయంత్రం ఇజ్రాయెల్ బయలుదేరనుంది. మంగళవారం నుండి అంతర్జాతీయ వ్యవసాయ ప్రదర్శన ప్రారంభం కానుంది. దీని కోసం పోచారం నేతృత్వంలో శాసన సభ్యులు, అధికారులు... ఓ బృందంగా వెళ్లనున్నారు.