రాచపాళెంకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
న్యూఢిల్లీ: ప్రముఖ తెలుగు సాహిత్య విమర్శకుడు రాచపాళెం చంద్రశేఖర రెడ్డికి ఈ ఏటి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. కడప జిల్లాకు చెందిన రాచపాళెం చంద్రశేఖర రెడ్డి మన నవలలు - మన కథానికలు అనే పుస్తకానికి ఉత్తమ విమర్శకుడిగా ఈ పురస్కారం లభించింది.
రాయలసీమ సాహిత్యోద్యమాల చరిత్ర, దళిత కథలు, ఆధునికాంధ్ర కవిత్వం, గురజాడ కథానికలు వంటి రచలను ఆయన వెలువరించారు. ఆయన సాహిత్య విమర్శనా వ్యాసాలు అన్ని పత్రికల్లో విరివిగా ప్రచురితమయ్యాయి. తనకు ఈ పురస్కారం రావడంపై రాచపాళెం చంద్రశేఖర రెడ్డి ఓ ప్రముఖ టీవీ చానెల్ ప్రతినిధి వద్ద ప్రతిస్పందించారు.
ఇది తాను ఎదురు చూడని పురస్కారమని ఆయన అన్నారు. ఈ పురస్కారం లభించినందుకు తనకు చాలా ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. జాతీయ స్థాయిలోనే ఇది అత్యున్నత పురస్కారమని, ఈ పురస్కారంతో తన బాధ్యత మరింత పెరిగిందని ఆయన అన్నారు. భవిష్యత్తులో రాయలసీమ రచనలపై మరితంగా కృషి చేస్తానని ఆయన చెప్పారు.