ఎస్వీయూలో ర్యాగింగ్ కలకలం: ఏడుగురు విద్యార్థుల సస్పెండ్
చిత్తూరు: ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్న ర్యాగింగ్ భూతం జూనియర్లను వేధిస్తూనే ఉంది. మొన్న గుంటూరు, నిన్న ఏలూరు, తాజాగా తిరుపతి.. విద్యాలయాల్లో ర్యాగింగ్ కలకలం రేపింది.
గుంటూరులోని ఆచార్య నాగార్జున వర్సిటీలో సీనియర్ల వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకున్న బీఆర్క్ విద్యార్థిని రిషితేశ్వరి ఘటనతో కఠిన చర్యలకు ఏపి సర్కారు తెరలేపినా, సీనియర్లు యథేచ్ఛగా ర్యాగింగ్ కు పాల్పడుతున్నారు.
తాజాగా, తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని ఎంసిఏ విభాగంలో ఇటీవల జూనియర్లపై సీనియర్లు వికృత చేష్టలకు పాల్పడ్డారు. వర్సిటీలోని డి-బ్లాక్ లో వెలుగు చూసిన ఈ ఘటనపై విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ దేవరాజు, రెక్టార్ జయశంకర్ దర్యాప్తు చేశారు.
దర్యాప్తులో ర్యాగింగ్ జరిగిన మాట వాస్తవమేనని తేలింది. దీంతో ర్యాగింగ్కు పాల్పడ్డ సీనియర్ విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని వర్సిటీ రిజిస్ట్రార్ స్పష్టం చేశారు. కాగా, ర్యాగింగ్ విషయం తెలుసుకున్న మంత్రి గంటా శ్రీనివాసరావు ఎస్వీయూ వీసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ర్యాగింగ్ పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.
ఇది ఇలా ఉండగా, విచారణ జరిపిన అధికారులు సోమవారం సాయంత్రం ర్యాగింగ్కు పాల్పడిన ఏడుగురు విద్యార్థులను సస్పెండ్ చేశారు.
పాఠశాలల మూసివేత జీవోను రద్ధుచేయాలి
తెలుగు మీడియం ఉన్న పాఠశాలలను మూసివేసే జీవోను రద్ధుచేయాలని ఎస్టీయూ నేతలు డిమాండ్ చేశారు. తెలుగు మీడియం, ఇంగ్లీషు మీడియం సమాంతరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆదివారం ఎస్టీయూ కార్యాలయంలో రాష్ట్ర కౌన్సిలర్ నరసింహారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు శివశంకర్రెడ్డి, రీజనల్ కన్వీనర్ సంగమేశ్వర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి రామాంజనేయరాజు, రాజశేఖర్, తదితరులు సమావేశం అయ్యారు. జీవోపై చర్చించారు.
ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్ధుచేయకుండా సమాంతరంగా నిర్వహించాలని, ప్రాథమిక స్థాయి నుంచి ఆంగ్లమాధ్యమం ఏర్పాటుచేయాలని కోరారు. ఉపాధ్యాయులకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చిన తర్వాత ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని కోరారు.