తెలంగాణలో చేసిందే....: రాయలసీమ చిచ్చు, మెడికల్ సీట్లపై పోరు
తిరుపతి: తెలంగాణ విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత రాయలసీమ చిచ్చు ప్రారంభమవుతున్నట్లు కనిపిస్తోంది. పద్మావతి విశ్వవిద్యాలయంలోని మెడికల్ సీట్ల విషయంలో రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి, రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గళమెత్తారు.
తిరుపతిలోని పద్మావతి మెడికల్ విశ్వవిద్యాలయం ఎదుట రాయలసీమ పరిరక్షణ సమితి నేతలు ఆందోళన నిర్వహించారు. నీరు, నిధులు, హక్కుల్లో రాయలసీమకు అన్యాయం జరుగుతోందంటూ గళమెత్తారు. ఈ ఆందోళనలో రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
పద్మావతి విశ్వవిద్యాలయంలో మెడికల్ సీట్లను రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలకు కూడా ఎలా కేటాయిస్తారని బైరెడ్డి రాజశేఖర రెడ్డి ప్రశ్నించారు. రాజ్యాంగం అంటే గౌరవముందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ ఉండాలని కోరుకోవడం లేదా అని కూడా నిలదీశారు.
రాయలసీమకు అన్యాయం జరిగితే సహించబోమని అన్నారు. సీమ విద్యార్థులకు అన్యాయం చేసే 120జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం చేయాల్సి వస్తుందని అన్నారు. తెలంగాణలో ఏం చేశారో రాయలసీమలో కూడా అదే చేస్తున్నారని విమర్శించారు. అలాగే చేస్తూ రాయలసీమను ఏపి నుంచి పంపించాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఇలాగే చేస్తే తెలంగాణ ఏర్పడినట్లే రాయలసీమ రాష్ట్రం కూడా ఏర్పడుతుందని హెచ్చరించారు.
ఉద్యోగాలు, నీరు, కరువు పీడిత ప్రాంతాల కోసం ఉద్యమం చేస్తామని అన్నారు. అవసరమైతే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుంటామని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. సెప్టెంబర్ 9న సీమ సమస్యలపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపడుతున్నట్టు ఆయన వెల్లడించారు. కాగా, ఆందోళన సమయంలో విశ్వవిద్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు విద్యార్థులు యత్నించగా పోలీసులు అడ్డుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు.
రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘన: రఘువీరా
తిరుపతిలోని పద్మావతి విశ్వవిద్యాలయంలో 85 శాతం సీట్లు స్థానికులకే కేటాయించాలని ఏపీసీసీ అద్యక్షుడు రఘువీరారెడ్డి కోరారు. పద్మావతి విశ్వవిద్యాలయం అడ్మిషన్లపై ఇచ్చిన జీవో 120ను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పు ప్రకారమే మెడికల్ సీట్లు కేటాయించాలని కోరారు.
హైకోర్టు కొట్టివేసిన ఈ జీవోపై సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అప్పీలును కూడా విరమించుకోవాలని రఘువీరా విజ్ఞప్తి చేశారు. జోనల్ వ్యవస్థను ఉల్లంఘించే నిర్ణయాలు సరైనవి కావన్నారు. దానివల్ల ప్రాంతీయ విభేదాలు తలెత్తుతాయని, రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు దక్కాల్సిన మెడికల్ సీట్లు మిగతా జిల్లాలకు దక్కడం బాధాకరమని అన్నారు.
అంతేగాక 13 జిల్లాలను లోకల్ గా పరిగణిస్తే రాయలసీమకు నష్టమని అన్నారు. సీట్ల కేటాయింపు విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్నారని ఆయన విమర్శించారు. విభజన చట్టం ప్రకారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని రఘువీరా డిమాండ్ చేశారు.