ప్రజావంచన: దేవినేని సిగ్గుపడాలన్న రఘువీరా
విజయవాడ: కృష్ణా డెల్టాలో సాగునీరందక పంటలు ఎండిపోతున్నాయని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అన్నారు. ఇందుకు ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సింగుపడాలని దుయ్యబట్టారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆరోపిస్తూ మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజావంచన పేరుతో విజయవాడలో భారీ ఆందోళన చేపట్టారు.
ఈ ఆందోళనలో రఘువీరారెడ్డితోపాటు మండలి విపక్ష నేత సి రామచంద్రయ్య, కాంగ్రెస్ నేత దేవినేని నెహ్రూ, భారీగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
దేవినేని నెహ్రూ మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు విడుదల చేసిన మేనిఫెస్టోను అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. మోసపూరిత హామీలతో ఏపి సిఎం చంద్రబాబునాయుడు ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.