రేవంత్ రెడ్డిని వదిలేసి, దళితుడు కాబట్టి ఎంపీకి నోటీసులా: బాబుపై రఘువీరా
విశాఖపట్నం: ఓటుకు నోటు సంఘటనలో రెడ్ హ్యాండెడ్గా దొరికిన తెలంగాణ ఎమ్మెల్యే రేవంత్రెడ్డిని వదిలేసి, తెలిసో తెలియకో సైనికులపై విమర్శలు చేసిన దళిత పార్లమెంటు సభ్యుడు రవీంద్రబాబుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నోటీసులు ఇవ్వడాన్నిఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరా రెడ్డి తప్పు పట్టారు. ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అక్రమార్కులకే తాను అండగా ఉంటానన్న వాస్తవాన్ని వెల్లడించారని ఆయన విమర్శించారు.
విశాఖపట్నంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. దళితుడైన అమలాపురం ఎంపి రవీంద్రబాబు విషయంలో అత్యుత్సాహాన్ని ప్రదర్శించి షోకాజ్ నోటీసు జారీ చేయడం దళితుల పట్ల చంద్రబాబుకు ఉన్న వివక్షకు అద్దం పడుతోందని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసేందుకు నోట్లకట్టలతో పట్టుబడిన రేవంత్ జోలికెళ్తే తన బండారం బయటపడుతుందని భయడపడిన చంద్రబాబు కనీసం సంజాయిషీ కూడా అడగలేదన్నారు.
ఓటుకు నోటు కేసులో చంద్రబాబు, ఫోన్ట్యాపింగ్ ఆరోపణలపై తెలంగాణ సిఎం కెసిఆర్ల వ్యవహారంతో పాటు కేసుతో సంబంధం ఉన్న అందరిపైనా సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో సిబిఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదే అంశంపై రాష్ట్ర పర్యటనలో ఉన్న రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని స్వయంగా కలిసి విచారణకు డిమాండ్ చేయనున్నట్టు తెలిపారు.
రాష్ట్ర విభజన చట్టంలోని హామీలపై కనీసం నోరు మెదపని చంద్రబాబు సెక్షన్ 8ని అడ్డుపెట్టుకుని విద్యార్థి, ఉద్యోగ వర్గాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు తనపై వచ్చిన ఓటుకునోటు ఆరోపణల నుంచి తప్పించుకునేందుకు సెక్షన్ 8ని అడ్డుపెట్టుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం, కేంద్రంలో బిజెపిలు అధికారంలో ఉన్నాయని, విభజన చట్టంలో హామీలను సాధించే దిశగా ఎందుకు ఉద్యమించట్లేదని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ప్రత్యేకహోదా, ఉత్తరాంధ్ర, రాయలసీమలకు ఆర్థిక ప్యాకేజీ, తదితర విభజన హామీలపై పోరాటానికి ఎందుకు వెనుకాడుతున్నారన్నారు.
రాష్ట్రంలో రైతులు చేసుకుంటున్న ఆత్మహత్యలన్నీ సర్కారీ హత్యలేనని రఘువీరా ధ్వజమెత్తారు. రుణమాఫీతో రైతులను మోసగించిన సిఎం చంద్రబాబు వారి ఉసురు తీస్తున్నారని ఆరోపించారు. గతంలో తాను అధికారంలో ఉండగా వ్యవసాయం దండగన్న చంద్రబాబు మరోసారి తన వైఖరిని చాటుకుంటున్నారని మండిపడ్డారు. రైతుకు భరోసా అంటూ యాత్రలకు సిద్ధమవుతున్న చంద్రబాబు ఆత్మహత్యలకు భరోసా ఇస్తున్నారని విమర్శించారు.