వెలగపూడి కష్టాలు: బురదతో చిత్తడి చిత్తడి (ఫోటోలు)
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుంటూరు జిల్లా వెలగపూడిలో ఏర్పాటు చేసిన తాత్కాలిక సచివాలయం చిత్తడి చిత్తడిగా మారిపోయింది. బుధవారంనాడు అది బురదలో చిక్కుకుపోయింది. రెండు రోజులుగా ఇక్కడ కురుస్తున్న వర్షాల వల్ల ఇబ్బందిగా మారింది. సచివాలయానికి నాలుగు వైపులా నడవడానికి వీలు లేని స్థితిలో బురద పేరుకుపోయింది.
నల్లరేగడి భూములు కావటంతో చిన్నపాటి వర్షానికే ఈ ప్రాంతమంతా బురద పేరుకుని పోతోంది. కొద్దిరోజుల క్రితం సచివాలయానికి నిర్మించిన అప్రోచ్ రోడ్డుపై బురద పేరుకుపోవడంతో ఆ రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. సచివాలయాన్ని ప్రారంభించడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్దయెత్తున వస్తుండటంతో వారు బురదబారిన పడకుండా ఉండేందుకు సిబ్బంది చేసిన తాత్కాలిక ఏర్పాట్లు చేశారు.
ఆ ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. దీంతో సచివాలయానికి వచ్చిన ప్రతిఒక్కరూ ఇబ్బందులకు గురయ్యారు. కాగా, సచివాలయంలో బుధవారం ప్రారంభించిన బ్లాకుల్లో పనులు ఏమాత్రం పూర్తికాలేదు. ఓపక్క జోరున వర్షం కురుస్తున్నా సిమెంట్ పనులను నిరాఘాటంగా కొనసాగిస్తున్నారు. మరోపక్క యుపివిసి కిటికీలను హడావిడిగా అమరుస్తూ వెళ్లారు.
వర్షం నీళ్లు లోనికి వస్తన్నాయి..
ఇది వరకే కిటికీల నుంచి వర్షపు నీరు సచివాలయం ఛాంబర్లలోకి వచ్చేస్తోంది. ఛాంబర్లలో వైరింగ్ పని పూర్తికాలేదు. వర్కింగ్ స్టేషన్లను పేరుకు మాత్రమే ఏర్పాటు చేశారు.
గోడలకు బదులు ఇలా...
గోడలకు బదులు జిప్సమ్ షీట్లను తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. ఆ పనులు పూర్తి చేసేందుకు కనీసం నెలరోజుల వ్యవధి పడుతుందని సిబ్బంది అంటున్నారు ఇవన్నీ పూర్తవడానికి కనీసం నెలరోజులు పడుతుందని చెపుతున్నారు.
అంతా చక్కబడుతుంది..
తాత్కాలిక రాజధానికి ఉద్యోగులను తరలించాలనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా నాలుగు ప్రధాన కార్యాలయాలను సచివాలయంలో ప్రారంభించామని, వచ్చే నెలాఖరుకు పూర్తిస్థాయిలో కార్యాలయాలు ఏర్పాటవుతాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్ తెలిపారు.
ఆగస్టు చివరినాటికి...
సచివాలయ ప్రాంగణంలో రోడ్లు, ఫ్లోరింగ్, ప్రధాన రహదార్లతో పాటు టాయిలెట్లు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. ఆగస్టు మొదటి వారం నుంచి సచివాలయంలో పూర్తిస్థాయి విధులు ప్రారంభం అవుతాయనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
తప్పుద మరి..
తొలిరోజే సచివాలయంలో ఇబ్బందులు ఎదురైనమాట వాస్తవమేనని, అయితే ప్రజాప్రయోజనాల కోసం తాము తరలిరాక తప్పదని సచివాలయ ఉద్యోగుల సంఘం నేత మురళీకృష్ణ అన్నారు. కొత్తగా నిర్మాణాలు జరుగుతున్నందున అన్నిస్థాయిల్లో సదుపాయాలు ఇప్పుటికప్పుడే కల్పించడం కష్టమని అన్నారు.
మంత్రులు కూడా...
కొత్త సచివాలయంలో బ్లాకులను ప్రారంభించడానికి మంత్రులు వచ్చారు. వారు ఉద్యోగులకు స్వాగతం పలుకుతూ ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు.
పనులు ప్రారంభం..
మంత్రులు, అధికారులు కొత్త తాత్కాలిక సచివాలయంలో తమ పనులకు శ్రీకారం చుట్టారు. అలా ఫైళ్లను క్లియర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇలా స్వాగతం...
హైదరాబాదు నుంచి వెలగపూడి తాత్కాలిక సచివాలయానికి చేరుకుంటున్న ఉద్యోగులకు ఇలా పుష్పగుచ్ఛాలు ఇస్తూ, స్వీట్లు తినిపిస్తూ స్వాగతం పలుకుతున్నారు.
వర్షాల కారణంగా వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం చిత్తడి చిత్తడిగా
మారింది. అంతా బురదమయం కావడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. కానీ, ఈ మాత్రం కష్టాలు తప్పవనే సానుకూల దృక్పథంతో వారు ముందుకు సాగుతున్నారు.