హైదరాబాద్లో స్కైవేలు: కెసిఆర్తో ఇజ్రాయెల్ బృందం భేటీ
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో పలు చోట్ల ఎలివేటెడ్ కారిడార్లు, స్కైవేలు మల్టీలెవల్ గ్రేడ్ సెపరేటర్లు నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తెలిపారు. నగరంలో పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యలపై ఆయన అధికారులతో సమావేశమయ్యారు. నిర్మాణాలకు అవసరమైన ప్రదేశాలను ఎంపిక చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
తార్నాకా -ఇసిఐఎల్ క్రాస్ రోడ్స్ మధ్య, నాగార్జున సర్కిల్ - మాదాపూర్ మధ్య, హరిహర కళాభవన్ - ఉప్పల్ మధ్య స్కైవేలు నిర్మించాలని ప్రతిపాదనలు చేశారు. దీంతో పాటు కొన్ని ఎంపిక చేసిన కీలకమైన కూడళ్లలో స్కైవేల నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. నగరంలో 11 చోట్ల స్కైవేలు నిర్మించాలని కెసిఆర్ ప్రతిపాదించారు.
హైదరాబాద్ నగరంలో షీ ట్యాక్సీల ఏర్పాటుకోసం ఒక కమిటీని నియమించాలని తెలంగాణ సర్కారు శుక్రవారం నిర్ణయం తీసుకుంది. నలుగురు సభ్యులతో కూడిన కమిటీ చైర్మన్గా ట్రాన్స్పోర్టు కమిషనర్ వ్యవహరించనున్నారు. షీ ట్యాక్సీల ఏర్పాటులో భాగంగా తొలివిడతగా హైదరాబాద్, సైబరాబాద్లో 50 మంది మహిళా డ్రైవర్లను ఎంపిక చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఇజ్రాయిల్ ప్రతినిధుల బృందం శుక్రవారం సీఎం కేసీఆర్ను కలిశారు. నగరంలో చేపట్టనున్న రోడ్ల నిర్మాణానికి సంబంధించి ఇజ్రాయిల్ ప్రతినిధులతో సీఎం చర్చించినట్లు తెలిసింది. హైదరాబాద్ నగరంలో రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయని, సింగపూర్ తరహాలో భాగ్యనగరి రోడ్లను అభివృద్ధి చేస్తామని ఇదివరకే కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయిల్ బృందం, ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసినట్లు అధికార వర్గాల సమాచారం.
జనవరి 1 సెలువు
జనవరి 1న సెలవు దినంగా ప్రకటిస్తూ తెలంగాణ మంత్రివర్గం ఆమోదముద్రవేసింది. శుక్రవారం జరిగిన తెలంగాన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గ్రామపంచాయతీల్లో వివాహనమోదు చట్టానికి ఆమోదం తెలుపుతూ ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వం దత్తత తీసుకోవడానికి అంగీకారం తెలిపింది. అదేవిధంగా హైదరాబాద్లో క్రిస్టియన్ భవన్కు పది కోట్లరూపాయలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. పార్లమెంటరీ సెక్రటరీ ఆర్డినెన్స్కు కూడా కేబినెట్లో ఆమోదం లభించింది. పార్లమెంటరీ కార్యదర్శుల నియామకానికి మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.
రామచంద్రారెడ్డికి పరామర్శ
మాజీ స్పీకర్ రామచంద్రారెడ్డిని, సీఎం కేసీఆర్ శుక్రవారం ఉదయం ఎస్ఆర్నగర్లోని ఆయన నివాసంలో పరామర్శించారు. రామచంద్రారెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలిసిన కేసీఆర్ స్పందించి ఆయనను శుక్రవారం కలిశారు.
డిక్కీ ప్రతినిధుల భేటీ
సచివాలయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ను డిక్కీ ప్రతినిధులు కలిశారు. హైదరాబాదులోని హైటెక్స్లో ఏర్పాటు చేసే డిక్కీ ప్రదర్శనకు వారు ముఖ్యమంత్రిని ఆహ్వానించారు వచ్చే నెల 13, 14, 15 తేదీల్లో డిక్కీ ఎక్స్పో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.