నర్సు ఘాతుకం: ప్రియుడి కోసం భర్తను చంపేసింది
వృత్తిరీత్యా నర్సు అయిన ఓ మహిళ అత్యంత దారుణమైన పనికి ఒడిగట్టింది. ప్రియుడి కోసం భర్తను మట్టుబెట్టింది. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నంలో చోటు చేసుకుంది.
రాజమండ్రి: వృత్తిరీత్యా నర్సు అయిన ఓ మహిళ అత్యంత దారుణమైన పనికి ఒడిగట్టింది. ప్రియుడి కోసం భర్తను మట్టుబెట్టింది. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నంలో చోటు చేసుకుంది.
ఎక్కువ మోతాదులో మత్తు మందు ఇచ్చి ఇంజక్షన్ చేసి ఆమె తన భర్తను చంపేసింది. పోలీసులు ఇందుకు సంబంధించిన వివరాలను అందించారు. మృతుడు భీమ శంకర్ (30) తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం ద్రాక్షారామానికి చెందినవాడు.
అతను మే 17వ తేదీన తన సమీప బంధువు అయిన జయలక్ష్మిని వివాహం చేసుకున్నాడు. జయలక్ష్మి ద్రాక్షారామంలోనే నర్సు వృత్తిలో కొనసాగుతోంది.
సహోద్యోగితో అఫైర్
ఆస్పత్రిలో తనతో పాటు పనిచేస్తున్న వై గిరీష్ అనే వ్యక్తితో ఆమె సంబంధం పెట్టుకున్నట్లు, ఆ సంబంధం గత మూడేళ్లుగా సాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం తెలిసిన భీమ శంకర్ అతనితో సంబంధం తెంచుకోవాలని భార్యకు చెబుతూ వచ్చాడు.
జయలక్ష్మి కుట్ర....
అదే విషయంపై భార్యాభర్తల మధ్య తరుచుగా గొడవలు జరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో భర్త భీమశంకర్ను హతమార్చాలని జయలక్ష్మి కుట్ర చేసింది. ఆగస్టు 29వ తేదీన జయలక్ష్మి, భీమ శంంకర్ గౌరీపట్నంలోని గుడికి వెళ్లారు. ఆ సమయంలో తన పథకాన్ని జయలక్ష్మి పకడ్బందీగా అమలు చేసింది.
తెలియని భర్త సరేనన్నాడు....
భీమా శంకర్ కాస్తా నలతగా ఉన్నట్లు కనిపించాడు. దాన్ని అవకాశంగా తీసుకుని జయలక్ష్మి ఓ ఇంజక్షన్ తీసుకోవాలని సూచించంది. ఆమె కుట్ర గురించి తెలియని శంకర్ అందుకు అంగీకరించాడు. దాంతో జయలక్ష్మి భర్త శంకర్కు 10 మిల్లీలీటర్ల కెటమైన్ శరీరంలోకి ఎక్కించింది. కొద్ది నిమిషాల్లోనే అతని ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి.
గుర్తు తెలియని శవం
పోలీసులు ఆగస్టు 29వ తేదీన గుర్తు తెలియని శవాన్ని గౌరీపట్నం ఆలయం నుంచి స్వాధీనం చేసుకున్నారు. జాగ్రత్తగా పరిశీలిస్తే అతను ధరించిన చొక్కా కాలర్పై డిఆర్ఎం లోగో కనిపించింది. అది చొక్కా కుట్టిన టైలర్ షాపుదై ఉంటుందని గుర్తించారు. ఆ టైలర్ షాపు ద్రాక్షారామంలో ఉన్నట్లు కనిపెట్టారు.
సిసిటీవీ ఫుటేజీల పరిశీలన...
ఆలయానికి చెందిన సిసీటీవి ఫుటేజీలను పోలీసులు జాగ్రత్తగా పరిశీలించారు. శంకర్తో పాటు ఓ మహిళ గుడిలోకి వచ్చినట్లు వారికి తెలిసి వచ్చింది. ఆమె అతని భార్య జయలక్ష్మి కావచ్చునని అనుమానించి, ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. ఆమె నేరాన్ని అంగీకరించింది. శంకర్ను చంపడానికి గిరీష్ కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రి నుంచి ఇంజక్షన్ తెచ్చినట్లు చెప్పింది. దీంతో కేసు చిక్కు ముడి వీడింది.