ఏపీ, టీ దేవుళ్లని ట్వీట్: 'రామ్గోపాల్ వర్మ సారీ చెప్పాలి'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామిని తెలంగాణ ప్రజలు ఎక్కువగా ప్రార్థించడం యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామిని అవమానించడమే అవుతుందని వ్యాఖ్యలు చేసిన చలన చిత్ర దర్శకుడు రామ్గోపాల్ వర్మ వెంటనే క్షమాపణలు చెప్పాలని తెలంగాణ పీసీసీ అధికార ప్రతినిధి జీ నిరంజన్ డిమాండ్ చేశారు.
కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశం
తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఫిర్యాదుతో రామ్గోపాల్ వర్మ పైన కేసు నమోదు చేయాల్సిందిగా న్యాయస్థానం పోలీసులను గురువారం ఆదేశించింది.
తెలుగు ప్రజల ఆరాధ్య దైవాలైన శ్రీ వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ నరసింహ స్వామిల పైన సామాజిక మాధ్యమం ట్విట్టర్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు న్యాయవాదులు భార్గవ్, గోవర్ధ్ రెడ్డిలు సంయుక్తంగా సైబరాబాద్ రెండో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ న్యాయస్థానంలో ఫిర్యాదు దాఖలు చేశారు.
ఆయన పైన చర్యలు తీసుకోవాలని ఎళ్బీ నగర్ పోలీసులను ఆదేశించాలని వారు న్యాయస్థానాన్ని కోరారు. ఫిర్యాదును పరిశీలించిన మెజిస్ట్రేట్ రామ్గోపాల్ వర్మ పైన కేసు నమోదు చేసి దర్యాఫ్తు నిర్వహించి సమగ్ర నివేదిక సమర్పించాలని గురువారం పోలీసులను ఆదేశించారు.
కాగా, రెండు రోజుల క్రితం రామ్గోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ వారికి యాదిగిరి నరసింహుడు ఉండగా.....ఆంధ్రా వారి దేవుడు బాలాజీ(వెంకటేశ్వర స్వామి)ని ఎక్కువగా ఎందుకు పూజిస్తున్నారు? ఇది సరైందేనా? అంటూ ట్విట్టర్లో ప్రశ్నలు సంధించారు.
ఇంతటితో ఆగని రామ్ గోపాల్ వర్మ..... నేను దేవుడిని అసలు నమ్మను, కానీ తెలంగాణ వారు ఆంధ్రా దేవుడైన బాలాజీని పూజించడం అంటే యాదిగిరి నరసింహ స్వామిని అవమానించడమే. తెలంగాణ వారు తమ దేవుడి కంటే ఆంధ్రా దేవున్ని ఎక్కువగా పూజించడం సరైంది కాదంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్... యాదగిరి గుట్టను డెవలప్ చేయాలని నిర్ణయించడం చాలా సంతోషంగా ఉంది. ఆయన చేసే పనులు తెలంగాణ వారు వారి దేవుడి విలువ తెలుసుకునేలా చేస్తాయి అంటూ ట్వీట్ చేసారు.