ఆదినారాయణ రెడ్డి టిడిపి ఎంట్రీకి అడ్డంకి: లోకేష్, బాలకృష్ణలకు రామసుబ్బారెడ్డి షాక్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు, కడప జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని పార్టీలోకి చేర్చుకుంటే తాను పార్టీని వీడుతానని జమ్మలమడుగుకు చెందిన తెలుగుదేశం పారట్ీ సీనియర్ నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి అల్టిమేటం జారీ చేశారు.
శుక్రవారం పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్తో పాటు హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణలతో భేటీ అయిన సందర్భంగా ఆదినారాయణ రెడ్డి పార్టీలోకి వస్తే తాను పార్టీని వీడుతానని చెప్పినట్లు సమాచారం. ఆధినారాయణరెడ్డిని పార్టీలోకి చేర్చుకునే విషయంపై నిరసన వ్యక్తం చేశారు.
ఆదినారాయణరెడ్డి కారణంగా టిడిపికి చెందిన 150 మంది కార్యకర్తలు చనిపోయారని, అలాంటి వ్యక్తిని పార్టీలోకి ఎలా చేర్చుకుంటారని కూడా ఆయన లోకేష్, బాలయ్యలను నిలదీసినట్లు సమాచారం. అయితే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా నుంచి ఆయన పార్టీ నేతలు వస్తే, మనకే మంచిది కదా అని రామసుబ్బారెడ్డికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.
అయితే రామసుబ్రారెడ్డి ఏ మాత్రం మెత్తబడలేదని తెలుస్తోది. ఆయన పార్టీలోకి వస్తే తాను పార్టీ నుంచి బయటికి వెళ్లిపోతానని తేల్చేశారని అంటున్నారు. జమ్మలమడుగులోని తాజా రాజకీయ పరిణామాలను, మొదటి నుంచి తన కుటుంబం టిడిపికి అందిస్తున్న సేవలను కూడా రామసుబ్బారెడ్డి వారికి వివరించినట్లు సమాచారం. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని కూడా రామసుబ్బారెడ్డి కలిసే అవకాశం ఉందని అంటున్నారు.
కాగా, ఆదినారాయణ రెడ్డితో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు ఎంవి మైసురా రెడ్డి మాట్లాడినట్లు సమాచారం. పార్టీ అధ్యక్షుడు జగన్ సూచనల మేరకు ఆయన ఆదినారాయణ రెడ్డితో మాట్లాడినట్లు చెబుతున్నారు.