బొత్స జగన్ పార్టీలోకి వెళ్తారనుకోవడం లేదు: సిఆర్
హైదరాబాద్: తమ పార్టీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ తమ పార్టీ వీడుతారని తాను అనుకోవడం లేదని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు సీనియర్ నాయకుడు సి. రామచంద్రయ్య విశ్వాసం వ్యక్తం చేశారు. మాజీ పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఓ మంచి నాయకుడని ఆయన శనివారంనాడు మీడియా ప్రతినిధులతో అన్నారు.
తెలుగుదేసం పార్టీ మహానాడు ఆత్మస్థుతి పరనిందలా సాగిందని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై ఉదయం ఒక విధంగా, సాయయంత్రం మరో విధంగా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని సి.రామచంద్రయ్య విమర్శించారు.
బొత్స సత్యనారాయణ కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారని బలమైన ఊహాగానాలు చెలరేగుతున్నాయి. పార్టీలో చేరడానికి ఆయన జగన్కు కొన్ని షరతులు పెడుతున్నట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి జూన్ 2న జిల్లాలో పర్యటించనున్నట్లు పీసీసీ ఉపాధ్యక్షుడు ఆనం వివేకానందరెడ్డి తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా, దుగ్గరాజపట్నం పోర్టు అంశాలపై విస్తృతంగా చర్చించిస్తామని, అనంతరం వాటిపై నిర్ణయాలు తీసుకోనున్నట్లు ఆనం తెలిపారు.