ఆదినారాయణ రెడ్డితో ఇబ్బంది: రామసుబ్బా రెడ్డికి మళ్లీ బాబు పిలుపు
జమ్మలమడుగు టిడిపి నేత రామసుబ్బా రెడ్డికి ముఖ్యమంత్రి, పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నుంచి ఆదివారం మరోసారి పిలుపు వచ్చింది. తక్షణం తనను కలవాలని ఆయన సూచించారు.
కడప: జమ్మలమడుగు టిడిపి నేత రామసుబ్బా రెడ్డికి ముఖ్యమంత్రి, పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నుంచి ఆదివారం మరోసారి పిలుపు వచ్చింది. తక్షణం తనను కలవాలని ఆయన సూచించారు.
ఆది ఎఫెక్ట్: రామసుబ్బారెడ్డి అసంతృప్తికి కారణమిదే, త్వరలోనే ఎమ్మెల్సీ పదవి
ఆదినారాయణ రెడ్డి వైసిపి నుంచి టిడిపిలో చేరడాన్ని రామసుబ్బా రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా ఇటీవల ఆది ఆధిపత్యం పెరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసిపిలోకి వెళ్తారనే ప్రచారం సాగింది.
దీంతో చంద్రబాబును ఆయన శనివారం కలిశారు. తనకు టిడిపిని వీడాలనే ఉద్దేశ్యం లేదని, కానీ తమ మధ్య పొసగడం లేదని చంద్రబాబుకు రామసుబ్బా రెడ్డి చెప్పారు. దీంతో మరోసారి తనను కలవాలని చంద్రబాబు ఆదివారం సమాచారం పంపించారు.
చెప్పేది జరగడం లేదు
జమ్మలమడుగులో మంత్రి చెప్పేదొకటైతే, అక్కడ జరిగేది మరొకటిగా ఉంటుందని, అందరం కలిసే పని చేస్తామని ఆయన పైకి చెబుతున్నప్పటికీ, అలా జరగడం లేదని ఇప్పటికే సీఎం చంద్రబాబుకు రామసుబ్బా రెడ్డి చెప్పారని తెలుస్తోంది. ఇక్కడ టిడిపికి చెందిన వారు ఇబ్బంది పడుతున్నారని, పల్లెల్లోను, జమ్మలమడుగులోను టిడిపి నాయకులు, శ్రేణులు, కార్యకర్తలకు న్యాయం జరగడం లేదని చెప్పారు.
మేం చెప్పిన వారిని పక్కన పెట్టి కొడుకుకు పదవి
జమ్మలమడుగు మున్సిపల్ కమిషనర్గా నియమించిన అధికారిని టిడిపి నాయకులు వ్యతిరేకించినా మంత్రి ఆ కమిషనర్ను తీసుకు వచ్చారని చంద్రబాబు దృష్టికి రామసుబ్బా రెడ్డి తీసుకెళ్లారని తెలుస్తోంది. ఆసుపత్రి కమిటీలను టిడిపి కార్యకర్తలు, నాయకులతో నియమించాలని ముందు నుంచి ప్రతిపాదిస్తూ వచ్చామని అది జాప్యం జరుగుతూ వచ్చిందని, జమ్మలమడుగు ఆసుపత్రి కమిటీకి చైర్మన్గా గిరిధర్ రెడ్డి పేరును తాము ప్రతిపాదిస్తే ఆ పేరును పక్కనపెట్టి మంత్రి తన తనయుడిని నియమించుకున్నారని కూడా చెప్పారని తెలుస్తోంది.
ఆది తీరుతో ఇబ్బందులు
ఈ విషయాన్ని జిల్లా అధ్యక్షులు, ఇంచార్జ్ మంత్రి దృష్టికి తీసుకెళితే వారు తమకు తెలియదని చెప్పారని, వీరికి కూడా తెలియకుండా నియమించారా అని ముఖ్యమంత్రి చంద్రబాబుతో రామసుబ్బారెడ్డి వ్యాఖ్యానించారని తెలుస్తోంది. చాలా ఇబ్బందులు ఉన్నాయని, పార్టీ కార్యకర్తలు ఆదినారాయణ రెడ్డి తీరుతో ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.
మహానాడుకు వెళ్లడానికే ఇబ్బంది
మహానాడుకు 35 ఏళ్లుగా పాల్గొంటున్నానని, కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అయితే ఇటీవల జరిగిన మహానాడుకు వెళ్లడానికి ఇబ్బందిగా ఉండే వెళ్లలేదని చంద్రబాబుకు రామసుబ్బా రెడ్డి చెప్పారని తెలుస్తోంది. ఎన్టీఆర్ జయంతిని మాత్రం ఘనంగా నిర్వహించామని, తాను టిడిపిని వీడేది లేదని కూడా చెప్పారు.