జగన్ది కొంగజపం, కోట్లు దండుకున్న రఘువీరా: రావెల
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డిలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిశోర్ బాబు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాత్రింబవళ్లుకష్టపడుతుంటే విపక్షాలు కుట్రపూరితంగా రాజకీయం చేస్తున్నాయని ఆయన అన్నారు.
మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును విమర్శించే నైతిక అర్హత జగన్, రఘువీరారెడ్డిలకు లేదని అన్నారు. దొంగ దీక్షలు, కొంగ జపాలతో జగన్ ప్రజలను మోసం చేస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు.
వైయస్ రాజశేఖర రెడ్డిని అడ్డం పెట్టుకుని మేఘమథనం పేరుతో రఘువీరారెడ్డి కోట్ల రూపాయలు దోచుకున్నారని మంత్రి ఆరోపించారు. ప్రజల చేత ఛీకొట్టబడినవాళ్లు చంద్రబాబును విమర్శిస్తూ, ప్రభుత్వంపై బురద జల్లుతూ సంక్షేమానికి అడ్డుపడితే ప్రజలు చూస్తూ ఊరుకోరని ఆయన హెచ్చరించారు.
వెంకయ్య మాట నిలబెట్టుకోవాలి...
ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, లేదంటే రాజీనామా చేయాలని మాలమహానాడు నేత కారెం శివాజీ డిమాండ్ చేశారు. అమరావతి శంకుస్థాపనకు వస్తున్న ప్రధాని మోదీ హోదాపై స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు.
లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని శివాజీ తెలిపారు. మంగళవారం ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయిన ఆయన ఎన్నికల్లో ఇచ్చిన విధంగా ఎస్సీ సమస్య పరిస్కరించాలని వినతి చేశారు.