వేలకోట్ల భూములు కొన్నారు, అందుకే: ఐవైఆర్పై రాయపాటి విమర్శల దాడి
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ ఐవైఆర్ను బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి నుంచి తొలగింపు నిర్ణయం సరైనదేనని టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు అన్నారు. ఐవైఆర్ కృష్ణారావు వేరే పార్టీల అడుగుజాడల్లో నడుస్తున్నారని ఆయన అన్నారు.
జేసీ, లగడపాటి, కేశినేని పేర్లు చెప్పి బాబును టార్గెట్ చేసిన ఐవైఆర్
వేలకోట్ల భూములు
ఐవైఆర్ ఏదో పార్టీలో చేరాలన్న ఆలోచనలో ఉన్నారని ఆయన అన్నారు. రాజధాని ఏర్పాటును కూడా ఐవైఆర్ అడ్డుకోబోయారని తెలిపారు. ప్రకాశం జిల్లా దొనకొండలో ఐవైఆర్ వేల కోట్ల విలువైన భూములు కొన్నారని రాయపాటి ఆరోపించారు.
అందుకే అడ్డుకున్నారు..
అందుకే రాజాధానిని దొనకొండకు తరలించేందుకు ప్రయత్నించారని తెలిపారు. దొనకొండలో రాజధాని పెట్టాలని కేంద్ర హోంశాఖకు కూడా లేఖ రాశారని చెప్పారు. తానే ఈ విషయాన్ని సీఎం చంద్రబాబునాయుడు దృష్టి కి తీసుకెళ్ళానని రాయపాటి సాంబశివరావు తెలిపారు. ఐవైఆర్ పుస్తకం రాస్తే చదవడానికి అదేమైనా మహాభారతమా? రామాయణమా? అని ఎద్దేవా చేశారు.ఓసారి చూసి ప్రజలే పక్కన పెడతారని అన్నారు.
పోస్టులు పెట్టి..
ప్రభుత్వం, సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా ఫేస్బుక్లో పోస్టులు పెడుతున్నారనే ఆరోపణలతో బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి నుంచి ఐవైఆర్ కృష్ణారావును ఏపీ ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే.
కుట్ర అని ఐవైఆర్.. సమర్థించుకున్న ప్రభుత్వం
ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం, సీఎంపై కూడా విమర్శలు చేసి సంచలనంగా మారారు. తనకు సీఎం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని, తనను కుట్ర పూరితంగానే పదవి నుంచి తొలగించారని ఆరోపించారు. కాగా, ప్రభుత్వం మాత్రం తన చర్యను సమర్థించుకుంది. ప్రభుత్వంలో ఉండి ఇలా బహిరంగంగా విమర్శలు చేయడం సరికాదని హితవు పలికింది.