మోడీకి బురద, చంద్రబాబుకు పని: నోట్ల రద్దుపై రాయపాటి సంచలనం
న్యూఢిల్లీ/హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దుపై తెలుగుదేశం పార్టీ పార్లమెంటుసభ్యుడు రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నోట్ల రద్దుతో ప్రధాని నరేంద్ర మోడీకి బురద అంటుకుందని అన్నారు. ఆ బురదను తుడవమని కేంద్రం ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు పని అప్పగించిందని ఎద్దేవా చేశారు.
పెద్ద నోట్ల రద్దు నిర్ణయం మంచిదే కానీ, ప్రజల అవసరాలకు సరిపడా డబ్బులను బ్యాంకులకు అందజేయడంలో కేంద్రం విఫలమైందని అన్నారు. కొందరి వద్ద వందల కోట్లలో కొత్త నోట్లు పట్టుబడుతున్నాయని, బంగారం కూడా వందల కిలోల్లో దొరికిందని ఆయన చెప్పారు.
ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీకి నష్టం జరిగిందని, తెలుగుదేశం పార్టీకి కూడా నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పారు. ప్రజల ఇబ్బందుల నేపథ్యంలోనే విపక్షాలు పార్లమెంటులో ఆందోళన చేస్తున్నాయని రాయపాటి సాంబశివరావు తెలిపారు.
కాగా, పెద్ద నగదు నోట్ల రద్దుతో ఏర్పడిన సమస్యలను పరిష్కరించేందుకుగానూ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల కమిటీకి చంద్రబాబునాయుడు కన్వీనర్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాయపాటి పైవిధంగా స్పదించినట్లు తెలుస్తోంది.