ఎసిబి చార్జిషీట్: రేవంత్ రెడ్డి టార్గెట్, చంద్రబాబు పేరు కూడా..
హైదరాబాద్: తాను కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్లో తెలంగాణ ఎసిబి ప్రధాన నిందితుడిగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డిని మొదటి నిందితుడిగా పేర్కొన్నప్పటిరీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పేరును కూడా ప్రస్తావించింది. నిందితుల సంభాషణ ఆధారంగా, తెలంగాణ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా చంద్రబాబు పేరును కూడా చార్జిషీట్లో ప్రస్తావించినట్లు ఎసిబి ప్రత్ేయక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వి. సురేందర్ రావు తమకు చెప్పినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది.
ఆ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియా బుధవారంనాడు ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. ప్రధాన నిందితుడు ప్రస్తావించిన బాబు, బాస్, నాయుడు అనే పదాలను చంద్రబాబును ఉద్దేశించే వాడినట్లుగా ఎసిబి నిర్ధారణకు వచ్చినట్లు చెబుతున్నారు. ఎసిబి మంగళవారంనాడు నోటుకు ఓటు కేసులో 25 పేజీల చార్జిషీట్ను దాఖలు చేసింది.
చార్జిషీట్లో 39 మంది సాక్షులను, 319 పత్రాలను చేర్చింది. మరి కొంత మంది పేర్లు అనుబంధ చార్జిషీట్లో ఎసిబి చేర్చే అవకాశం ఉంది. దీన్ని త్వరలో కోర్టుకు సమర్పించాలనే ఉద్దేశంతో ఎసిబి ఉంది. కేసులో స్టీఫెన్సన్ను ఎసిబి ప్రధాన సాక్షిగా పేర్కొంది. నాయుడు ఆదేశాల మేరకే నిందితులు తనకు డబ్బులు ఇవ్వడానికి వచ్చారని ఆయన తన వాంగ్మూలంలో చెప్పారు.
స్టీఫెన్సన్తో జరిపిన ఫోన్ సంభాషణల్లో ప్రధాన నిందితుడు రేవంత్ రెడ్డి, హ్యారీ సెబాస్టియన్ పదే పదే బాస్, నాయుడు అనే పదాలను వాడినట్లు ఎసిబి గుర్తించింది. సెబాస్టియన్ ఫోన్ నుంచి స్టీఫెన్సన్తో మాట్లాడిన సందర్భంలోనూ, రేవంత్ రెడ్డి నేరుగా సంభాషించిన తరుణంలోనూ నాయుడు అనే పేరును ప్రస్తావించారు. దాంతో చంద్రబాబు పేరును చార్జిషీట్లో ప్రస్తావించినట్లు చెబుతున్నారు.
చంద్రబాబు కోణానికి బలం చేకూర్చడానికి ఎసిబి సంభాషణల నుంచి విస్తృతంగా చార్జిషీట్లో ఉటంకింపులు ఇచ్చింది. స్టీఫెన్సన్తో నిందితులు మాట్లాడిన సంభాషణల కాల్ డేటా సాధికారితను ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ ధ్రువీకరించిందని అంటున్నారు.
టిడిపికి ఓటేయడానికి స్టీఫెన్సన్ను ఒప్పించడానికి నిందితులు రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ సింహ, జెరూసెలం మత్తయ్య ఎలా ప్రయత్నాలు చేశారని, ఎలా సంప్రదింపులు జరపారనే విషయాన్ని ఎసిబి చార్జిషీట్లో వివరించింది.