2024లో లోకేష్ సీఎం అవుతారా?, టీడీపీ నేత నోట పవన్ కళ్యాణ్ డైలాగ్
హైదరాబాద్: 2024లో తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవిని అలంకరించబోతున్నారా? అంటే ఆ పార్టీ నేతలు అలాంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత రాజేంద్రప్రసాద్ ఈ విషయమై జోస్యం చెప్పారు.
ఆయన మచిలీపట్నంలో శనివారం మాట్లాడారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024లో లోకేష్ సీఎం పదవి అలంకరిస్తారని, చంద్రబాబు అవుతారని జోస్యం చెప్పారు. భవిష్యత్తులో పార్టీకి దిశా నిర్దేశనం చేసే సత్తా ఉన్న లోకేష్ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించేలా తీర్మానం చేశారు.
జగన్ యాత్రపై దేవినేని నిప్పులు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర ఎందుకు చేస్తున్నారో చెప్పాలని ఏపీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు సోమవారం వేరుగా ప్రశ్నించారు.
అనంతపురం, కడపలో అక్రమ మైనింగ్ను అడ్డుకున్నందుకా? చెప్పాలన్నారు. వైసీపీ నేతల ఎర్రచందనం స్మగ్లింగ్ను అరికడుతున్నందుకే జగన్ యాత్రలు చేస్తున్నారా చెప్పాలన్నారు. రాజకీయ మనుగడకోసమే జగన్ అనసవర యాత్రలు చేస్తున్నారన్నారు.
టీడీపీ ట్రెండ్ సెట్ చేస్తుంది: రావుల
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రావుల చంద్రశేఖర రెడ్డి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ డైలాగ్ కొట్టారు. దేశ రాజకీయాల్లో టీడీపీ ట్రెండ్ సెట్ చేస్తుందని, ఎవరినీ ఫాలో కాదని అన్నారు. ఆయన వరంగల్ జిల్లాలో మాట్లాడారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వచ్ఛ హైదరాబాద్ పేరిట హంగామా చేస్తున్నారని ఎద్దేవా చేశారు.