ఎన్టీఆర్ పేరు మార్పుపై తీర్మానం, చరిత్ర లేదా: కేసీఆర్
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయ టెర్మినల్కు స్వర్గీయ నందమూరి తారక రామారావు పెట్టడం పైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ, రాజీవ్ పేరునే కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర శాసన సభలో శుక్రవారం చర్చ జరిగింది. అనంతరం తీర్మానం చేశారు. ప్రభుత్వం పెట్టిన తీర్మానాన్ని కాంగ్రెస్, మజ్లిస్, వైయస్సార్ కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ సమర్థించాయి. తెలుగుదేశం, బీజేపీలు మార్పులు సూచించాయి.
స్వర్గీయ నందమూరి తారక రామారావు పైన తమకు అందరికీ గౌరవం ఉందని, చర్చ ఆయన గురించి కాదని, శంషాబాద్ విమానాశ్రయ టెర్నినల్కు ఆంధ్రా నేత పేరు పెట్టడమే తమకు అభ్యంతరమని, అసహజ రీతిలో టెర్మినల్ పేరు మార్చారని, ఎన్టీఆర్ను అగౌరవపర్చమని, ఉన్న పేరును కొనసాగించినా అభ్యంతరం లేదని, అంతర్భాగంగా ఉన్న డొమెస్టిక్ విమానాశ్రయాన్ని వేరు చేస్తూ ఎన్టీఆర్ పేరు పెట్టడం సరికాదని, కేంద్రం ముందుకు ఇలాంటి ప్రతిపాదన వస్తే ప్రభుత్వంతో సంప్రదించకుండా నిర్ణయం తీసుకోవడం పట్ల సభ అభ్యంతరం వ్యక్తం చేస్తోందని తీర్మానం చేశారు.
ఈ తీర్మానాన్ని బీజేపీ, టీడీపీ మినహా మిగిలిన పక్షాలు సమర్థించాయి. ఆ రెండు పార్టీలు మార్పులు సూచించాయి. జానా రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో సామరస్యం చెడగొట్టవద్దన్నారు. ఈ సమయంలో పేరు మార్పు సరికాదన్నారు. యథాస్థితిని కొనసాగించాలన్నారు.
ఎర్రబెల్లి మాట్లాడుతూ.. తాము రాజీవ్ పేరును తొలగించమని చెప్పడం లేదని, తీసేస్తే తీర్మానంలో రెండుపేర్లు తీసేయాలన్నారు. తాము సవరణ చేస్తున్నామన్నారు.
కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సెంటిమెంటుతో కూడిన వ్యవహారం కాబట్టి దీనిని మార్పు విషయమై ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఎన్టీఆర్ వల్ల జానా, జీవన్ రెడ్డి వంటి ఎందరో వచ్చారన్నారు. వైయస్ ప్రభుత్వం ఎన్నో తప్పులు చేసిందని, ఆనాడు ఎన్టీఆర్ పేరు ఉంటే దానిని తీసేసి రాజీవ్ గాంధీ పేరు పెట్టిందన్నారు. ఆ రోజు ఎన్టీఆర్ పేరు మార్చడం దురదృష్టకరమన్నారు.
కాంగ్రెస్ హయాంలో అన్నింటికి రాజీవ్, ఇందిర పేర్లే పెట్టారన్నారు. కాంగ్రెస్ హయాంలో రాజీవ్ యువ కిరణాలు బదులు కొమురం భీమ్ పేరు అని ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. తాము పేర్లు పెట్టినప్పుడు ఆయా ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఎన్టీఆర్ పేరు పైన అందరు ఆలోచిస్తూనే.. పీవీ నర్సింహా రావు వంటి వారి పేరును పెట్టేందుకు పరిశీలిస్తామన్నారు. రాజీవ్ పేరును మార్చి తెలంగాణ నాయకుడి పేరు పెడదామన్నారు.
అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిపాదించిన తీర్మానానికి తాము మద్దతిస్తున్నామన్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. పేరు మార్చాల్సి వస్తే కొమురం భీమ్ పేరు పెట్టాలన్నారు.
అంతకుముందు కేసీఆర్ మాట్లాడుతూ... ఎన్టీఆర్ గురించి ఇక్కడ చర్చ కాదని, పక్క రాష్ట్రం నేత పేరు ఎందుకన్నారు. తెలంగాణ వాళ్లు ప్రముఖులు ఉన్నారని చెప్పారు. విమానాశ్రయానికి సాదాసీదా వ్యక్తి పేరు లేదని మాజీ ప్రధాని రాజీవ్ పేరు ఉందన్నారు. ఏపీలో నాలుగు విమానాశ్రయాలు ఉన్నాయని, అక్కడ ఎన్టీఆర్ పేరు పెట్టుకోవచ్చన్నారు. ఇక్కడి ప్రజలకు విముక్తి వద్దా.. తెలంగాణ ప్రజలకు చరిత్ర లేదా అని ప్రశ్నించారు. కమ్యూనిస్టు పార్టీలే తమ పత్రిక పేరును మార్చుకున్నాయన్నారు.
తీర్మానంపై..
విమానాశ్రయానికి తెలంగాణ ప్రముఖుల పేర్లు పెట్టాలనే తమ విజ్ఞప్తిని ప్రభుత్వం పట్టించుకోనందున తాము నిరసన వ్యక్తం చేస్తున్నామని బీజేపీ శాసన సభా పక్ష నేత డాక్టర్ కే లక్ష్మణ్ అన్నారు. అనంతరం సభ సోమవారానికి వాయిదా పడింది.