జగన్ ఇలాఖాలో గెలుపెవరిది?: టీడీపీ చరిత్ర సృష్టిస్తుందా?, 'ఎమ్మెల్సీ ఫలితాలు'
జగన్ కంచుకోట అయిన కడపలో పాగా వేసి ఆయన దూకుడుకు కళ్లెం వేయాలని టీడీపీ భావిస్తుండగా.. ఎట్టిపరిస్థితుల్లోను ఆ స్థానం తమ పార్టీయే నిలుపుకోవాలన్న భావనలో జగన్ ఉన్నారు.
కడప: గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న ఇరు పార్టీలు నేటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాయి. ముఖ్యంగా కడప బరిలో టీడీపీ-వైసీపీ మధ్య పోరు సర్వత్రా ఉత్కంఠను రేకెత్తిస్తోంది. జగన్ కంచుకోట అయిన కడపలో పాగా వేసి ఆయన దూకుడుకు కళ్లెం వేయాలని టీడీపీ భావిస్తుండగా.. ఎట్టిపరిస్థితుల్లోను ఆ స్థానం తమ పార్టీయే నిలుపుకోవాలన్న భావనలో జగన్ ఉన్నారు.
టీడీపీతో పోల్చితే కడపలో పట్టు నిలుపుకోవడం జగన్ కు అత్యవసరం. లేనిపక్షంలో సొంత ఇలాఖాలోను జగన్ సత్తా తగ్గిపోయిందని అధికార పార్టీ వారు ఆరోపించే అవకాశం ఉంది. ఈ ఆరోపణలకు తావివ్వకుండా ఉండాలంటే వైసీపీ అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డి ఎమ్మెల్సీగా గెలుపు పొంది తీరాలి.
వైఎస్ వివేకా రాజకీయ గతాన్ని పరిశీలిస్తే.. 1981లో ఆయన రాజకీయ రంగప్రవేశం చేశారు. అప్పటినుంచి ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా అనేక పదవులు నిర్వర్తిస్తూ వస్తున్నారు. 2010లో కిరణ్కుమార్రెడ్డి కేబినెట్లో వ్యవసాయమంత్రిగా పనిచేశారు. ఆపై కాంగ్రెస్ ను వీడి వైసీపీలో చేరారు. జగన్ ఎమ్మెల్సీ సీటు ఖరారు చేయడంతో కడప నుంచి ప్రస్తుతం బరిలో ఉన్నారు.
ఇక టీడీపీ అభ్యర్థి మారెడ్డి రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాదాపు రెండు దశాబ్దాలుగా టీడీపీలో కొనసాగుతున్నారు. కర్ణాటకలో బీటెక్ పూర్తి చేసిన ఆయన 2011 బై ఎలక్షన్ లో పులివెందుల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎన్నికలో గెలుపు ఆయన రాజకీయ భవిష్యత్తు అత్యంత కీలకంగా మారింది. దీంతో ఎట్టిపరిస్థితుల్లోను గెలిచి తీరాలనే పట్టుదలతో బీటెక్ రవి ఉన్నారు.
అభ్యర్థుల మాటెలా ఉన్నా అంచనాలు మాత్రం తమకే అనుకూలంగా ఉన్నాయని టీడీపీ భావిస్తోంది. కడప స్థానిక సంస్థల ఎన్నికలో మొత్తం 839ఓట్లు పోలవగా.. బీటెక్ రవికి 449ఓట్లు, వివేకాకు 390ఓట్లు పోలైనట్లు టీడీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే వైసీపీ మాత్రం క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశముందని భావిస్తుండటం గమనార్హం.
టీడీపీలో ఉన్నప్పటికీ వైఎస్ మీద అభిమానంతో చాలామంది తమకే ఓటు వేసుంటారని వైసీపీ నేతలు భావిస్తున్నారు. మరోవైపు టీడీపీ మాత్రం కోడ్ విధానాన్ని అనుసరించి తమ ప్రజాప్రతినిధులు చేజారిపోకుండా జాగ్రత్తపడింది. ఫలితంగా క్రాస్ ఓటింగ్ కు అవకాశం లేదనేది ఆ పార్టీ వాదన. మొత్తం మీద ఓటర్లు ఎవరికి విజయం కట్టబెట్టారన్నది నేటితో తేలిపోనుంది.జగన్ ఇలాఖాలో గెలిచి కడప రాజకీయాల్లో టీడీపీ చరిత్ర సృష్టిస్తుందా? లేక జిల్లాలో తమ పట్టు నిలుపుకుని వైసీపీ సత్తా చాటుతుందా అన్నది వేచి చూడాలి.