రేవంత్తో రివర్స్, తెలంగాణలో ఏం పని: డిఫెన్స్లో పడ్డ బాబు ఏంచెప్తారు?
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అరెస్టు అయినప్పటి నుండి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇరకాటంలో పడ్డారని చెప్పవచ్చు. చంద్రబాబుకు అంతా రివర్స్ అవుతోంది. అంతేకాదు, రేవంత్ ఇష్యూ జరిగి రెండు రోజులు అవుతున్నా చంద్రబాబు పెదవి విప్పకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు.
రేవంత్ రెడ్డి వీడియో ఫుటేజీలో పదేపదే బాస్ అంటూ పేర్కొనడాన్ని అందరూ ప్రశ్నిస్తున్నారు. ఆ బాస్ చంద్రబాబే అంటున్నారు. దీంతో చంద్రబాబు డిఫెన్స్లో పడ్డారని, అందుకే బయటకు రావడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
రేవంత్ రెడ్డి ఇష్యూ పైన చంద్రబాబు ఏం మాట్లాడుతారా అనే ఆసక్తికర చర్చ సాగుతోంది. సోమవారం నాడు మంత్రివర్గ భేటీలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కానీ, బహిరంగంగా ఇప్పటి వరకు మాట్లాడక పోవడం గమనార్హం.
అంతేకాకుండా, తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు వరుసగా తెరాస వైపు వెళ్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు ఏపీలో అధికారంలో ఉన్నప్పటికీ అక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు పలువురు చూస్తున్నారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.
వైసీపీ నేతలు చెబుతున్న దీన్లో నిజం అబద్దం ఎంతున్నప్పటికీ.. టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ, ఇతర పార్టీ ఎమ్మెల్యేలు మావైపు చూస్తున్నారని వైసీపీ చెప్పడం గమనార్హం. అదే నిజమైతే తెలంగాణలో ఓ వైపు ఎమ్మెల్యేల జంప్ కొనసాగుతుండగానే.. అధికారంలో ఉండగానే టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ వైపు వెళ్తే అది సంచలనమే అవుతుంది.
రేవంత్ రెడ్డి ఇష్యూ ఆధారంగా ఇప్పటికే తెలంగాణలో తెరాస నేతలు నిప్పులు చెరుగుతున్నారు. తెలంగాణలో టీడీపీ పని ఖతమైందని, అదో డ్రామా కంపెనీలా తయారయిందని విమర్శిస్తున్నారు. దానికి తగినట్లుగానే తెలంగాణలో టీడీపీ రోజు రోజుకు దెబ్బతింటోంది.
రేవంత్ రెడ్డి ఇష్యూతో రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. మామూలుగా అయితే జనం దీనిని లైట్గానే తీసుకుంటున్నారని చెప్పవచ్చు. తనకు కంటిమీద నిద్రలేకుండా చేస్తున్న రేవంత్ను పక్కా ప్లాన్తో కేసీఆర్ ఇరికించారని భావిస్తున్నారు. అయితే, రాజకీయంగా మాత్రం టీడీపీ ఇబ్బంది పడుతోంది.
వైసీపీకి అందివచ్చిన ఆయుధం
రేవంత్ రెడ్డి ఇష్యూ వైసీపీకి అందివచ్చిన ఆయుధంగా మారింది. ఇతర పార్టీలకు మద్దతిచ్చినప్పుడు ఏదైనా పార్టీ కొంత చిక్కు ప్రశ్నలు ఎదుర్కొనడం సహజం. అయితే, రేవంత్ ఇష్యూ తర్వాత.. తెరాసకు మద్దతుపై జగన్ ఘాటుగా స్పందించారు.
నేను ఏ పార్టీకి మద్దతిస్తే నీకేమిటని ప్రశ్నించారు. అసలు తెలంగాణలో నీకేం పని అని ధ్వజమెత్తారు. అంతేకాకుండా, చంద్రబాబు పెదవి విప్పక పోవడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఇటు తెలంగాణలో తెరాస, అటు ఏపీలో విపక్ష వైసీపీ నిలదీస్తోంది.
రేవంత్ రెడ్డిపై చర్యలకు వెనుకడుగు ఎందుకు?
రేవంత్ పైన చర్యలకు చంద్రబాబు ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబుకు మొదటి మచ్చ వెన్నుపోటు, రెండో మచ్చ అవినీతి మరక అని చెబుతున్నారు. రేవంత్ వ్యవహారంలో చంద్రబాబు క్షమాపణలు చెబుతారా? లేక చర్యలు తీసుకుంటారా? లేక పెదవి విప్పుతారా? ఏం చెబుతారు? అని నిలదీస్తున్నారు.