భయపెట్టి, నన్ను లొంగదీసుకోవాలనే...: కెసిఆర్పై రేవంత్ రెడ్డి
హైదరాబాద్: ప్రభుత్వ ఆవినీతిని బయట పెట్టినందుకు తనపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు తీరుపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ తన బంధువులకు ప్రభుత్వ ఆస్తులను కట్టబెడుతున్నారని, ఆధారాలు బయటపెట్టినందుకు వారితో పిటిషన్లు వేయిస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఇలాంటి వాటికి భయపడేది లేదని అన్నారు. వారి అవినీతిని ఆధారాలతోసహా కోర్టులో నిరూపిస్తానని ఆయన అన్నారు. మైహోం అధినేత రామేశ్వరరావు వేసిన పరువు నష్టం దావా కేసులో రేవంత్రెడ్డి శుక్రవారం హైదరాబాదులోని నాంపల్లి కోర్టులో హాజరయ్యారు. కేసీఆర్ చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోడానికి తన వర్గం చేత పిటిషన్లు వేయించి, తనపై కక్ష సాధింపు చర్యలు చేపట్టారని ఆయన మీడియాతో అన్నారు.
తనను భయపెట్టి, లొంగదీసుకోవాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని, దాంట్లో భాగంగానే తనపై కోర్టులో పిటిషన్ వేశారని, న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని రేవంత్రెడ్డి అన్నారు. వాళ్లు కేసులు వేసినంత మాత్రాన భయపడేది ఏమీ లేదని, న్యాయపోరాటం చేస్తామని, శాసనసభలో పోరాటం చేస్తామని, తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కెసిఆర్ గానీ, ఆయన తాబేదార్లు గానీ ఎవరు ఎన్ని కేసులు పెట్టినా వెనక్కిపోయేదిలేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
అప్రజాస్వామికంగా బడ్జెట్ సమావేశాలు
బడ్జెట్ సమావేశాలు అప్రజాస్వామికంగా జరిగాయని కాంగ్రెస్ కార్యవర్గ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. రాష్ట్రం బాగుపడేలా బడ్జెట్ రూపకల్పన లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీలో స్పీకర్పై ప్రభుత్వంలోని కొన్ని శక్తులు ప్రభావం చూపుతున్నాయని ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో ఆరోపించారు.
తమ పార్టీ సభ్యురాలు డీకే అరుణపై టీఆర్ఎస్ సభ్యులు అనుచిత వ్యాఖ్యలు చేసి సభా గౌరవాన్ని దిగజార్చారని విమర్శించారు. పార్టీ ఫిరాయింపులపై ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, తలసాని శ్రీనివాస్ రాజీనామా చేసినప్పటికీ స్పీకర్ దానిని ఆమోదించడం లేదని భట్టి ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సరిగా పనిచేయలేకపోయామని, ఆ కారణంగానే ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టలేకపోయామని విక్రమార్క వివరించారు.