చర్పపల్లి జైలుకు: పాలు-పండ్లు తీసుకుంటున్న రేవంత్, డబ్బుపై ఏం చెప్తారు?
హైదరాబాద్: నామినేటెడ్ ఎమ్మెల్యేకు లంచం ఇవ్వజూపిన కేసులో అరెస్టై జైలులో ఉన్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి జైలులో అన్నం వంటి ఆహారం తీసుకోవడం లేదని తెలుస్తోంది. అతను కేవలం పండ్లు, పాలు మాత్రమే తీసుకుంటున్నారు.
ఆహారం తీసుకునేందుకు పెద్దగా చూపించడం లేదని తెలుస్తోంది. కాగా, సాయంత్రం రేవంత్ రెడ్డిని చంచల్ గూడ జైలు నుండి చర్లపల్లి జైలుకు తరలించారు. తనకు ప్రాణభయం ఉందని చెప్పడంతో రేవంత్ను జైలు మార్చారు.
ఆసుపత్రిలో చికిత్సపై ముగిసిన వాదనలు
రేవంత్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి పైన ఏసీబీ కోర్టులో మంగళవారం వాదనలు ముగిశాయి. ఆసుపత్రిలో చికిత్స చేయించాలంటూ రేవంత్ పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం విచారణ జరిపింది. జైలు డాక్టర్ సూచన మేరకు చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.
రేవంత్ రెడ్డి పెదవి విప్పితే!
ఏసీబీ అధికారులు సంఘటన స్థలంలో దొరికిన రూ.50 లక్షలతో పాటు రూ.5 కోట్ల గురించి ఆరా తీస్తున్నారు. దీనిపై ఐటీ కూడా ఆరా తీస్తోంది. ఆ డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయనే విషయం తెలియాల్సి ఉంది. ఈ డబ్బుల విషయమై విపక్షాలు చంద్రబాబుపై మండిపడుతున్నాయి. అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చిందని ప్రశ్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ ఏం చెబుతారనే విషయమై ఆసక్తి నెలకొంది.
రేవంత్ రెడ్డిని కావాలనే ఇరికించారు: నరేందర్ రెడ్డి
రేవంత్ రెడ్డి వ్యవహారంలో తెలంగాణ టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ను కావాలనే ఓటుకు నోటు వ్యవహారంలో ఇరికించారన్నారు. రేవంత్ అనుచరుడిని తుపాకీతో బెదిరించి స్టీఫెన్ ఇంటికి డబ్బులు తీసుకు వచ్చేలా చేశారని ఆరోపించారు.
కుట్రకు రేవంత్ బలయ్యారన్నారు. ఎమ్మెల్యేలను కొని ఐదో అభ్యర్థిని గెలిపించుకున్నారన్నారు. ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడానికి తెలంగాణ కేసీఆర్ జాగీరు కాదన్నారు. ప్రజలు కేసీఆర్కు బుద్ధి చెప్పే రోజు వస్తుందన్నారు.