నేనంటేనే వణుకు: కేసీఆర్పై రేవంత్, అక్బర్ అసంతృప్తి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి శుక్రవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆపరేషన్ బ్లూస్టార్ అంటే అర్థం తెలుసా అని ప్రశ్నించారు. తనకు ఉన్న అధికారాలను ముఖ్యమంత్రి దుర్వినియోగం చేస్తున్నారన్నారు.
తాను సభలో ఏం చెబుతానో అని ముఖ్యమంత్రి వణికిపోతున్నారన్నారు. అందుకే తన పైన దుష్ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. ఉద్యమ నాయకుడిని అని చెప్పుకొనే నేతకు ఇలాంటి పనులు తగునా అన్నారు. తెరాస తమవిగా పేర్కొంటున్న టీవీ, పేపర్లలో పెట్టుబడులు ఎక్కడి నుండి వచ్చావో ప్రకటించాలని డిమాండ్ చేశారు.
విద్యుత్ ప్రాజెక్టులు, సిమెంటు కంపెనీల్లో ఏముందో తాను చెప్పగలనని సవాల్ చేశారు. మీకు చెందిన పలు సంస్థలలో ఆంధ్రావారి పెట్టుబడులు లేవా అని ప్రశ్నించారు. డీఎల్ఎఫ్కు సంబంధించి మీరే ఏకపాత్రాభినాయం చేస్తారా అని ప్రశ్నించారు. తమకు అవకాశం ఇవ్వరా అన్నారు. సభలో విపక్షాలకు మాట్లాడే అవకాశం ఇచ్చేలా సభాపతి చర్యలు తీసుకోవాలని కోరారు.
బీఏసీలో చర్చించకుండానే అసెంబ్లీ సమావేశాలను పొడిగించడంపై మజ్లిస్ పార్టీ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభ నిబంధనలపై గౌరవం లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు.
షెడ్యూల్ ప్రకారం సభ నిర్వహణ శనివారం వరకే ఉందని, అలాంటప్పుడు సభను సోమవారానికి ఎలా వాయిదా వేస్తారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా అక్బర్ను సముదాయించేందుకు మంత్రి హరీష్ రావు ప్రయత్నించారు. కానీ, తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ అక్బర్ వెళ్లిపోయారు. బీఏసీ సమావేశాన్ని టీడీపీ బహిష్కరించింది. మజ్లిస్ కూడా దూరంగా ఉంది.