సచివాలయ తరలింపుపై రేవంత్ ఫైర్: నాగార్జున, అమల పేర్లు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని చెస్ట్ ఆస్పత్రి స్థలానికి తరలించాలనే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మంత్రివర్గ నిర్ణయాన్ని తప్పు పడుతూ తెలుగుదేశం తెలంగాణ నాయకుడు, శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి సినీ హీరో నాగార్జున, అమల పేర్లను ప్రస్తావించారు. పేదలకు చెందిన భూములపైనే కెసిఆర్ పడుతున్నారని, చెరువుల కబ్జాలను వదిలేస్తున్నారంటూ ఆయన వారిద్దరి పేర్లను ప్రస్తావించారు.
చెస్ట్ ఆస్పత్రిని తరలిస్తే సహించబోమని ఆయన కెసిఆర్ను హెచ్చరించారు. మంత్రివర్గ సభ్యులంతా కెసిఆర్ భజనలో నిమగ్నమయ్యారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. ప్రస్తుత సచివాలయం వల్ల పాలకులకు నష్టం జరిగిందేమో గానీ ప్రజలకు మేలే జరిగిందని ఆయన అన్నారు.
ప్రస్తుత సచివాలయం అంటే ముఖ్యమంత్రి కెసిఆర్ ఎందుకు భయపడ్తున్నారని ఆయన అడిగారు. సచివాలయానికి వాస్తు సరిగా లేకుంటే కెసిఆర్ ఎలా ముఖ్యమంత్రి అయ్యారని ఓ వాస్తు పండితుడు అడిగారని ఆయన అన్నారు. ఏటా 50 వేల మంది ఎర్రగడ్డలోని చెస్ట్ ఆస్పత్రికి వస్తుంటారని, ఆస్పత్రి తరలింపు వల్ల కొన్ని మెడికల్ సీట్లు కోల్పోతామని ఆయన అన్నారు. అన్యాయం చేస్తుందన్నవారు ఎపి ప్రభుత్వంపై ఎందుకు చర్చించలేదని అడిగారు. బంగ్లాలపై ఉన్న ఆసక్తి కరువుపై, రైతులపై ఎందుకు లేదని ఆయన అడిగారు.
మంత్రులను వేధించడం, సాధించడం, అవమానించడం, రాజకీయ హత్య చేసే చర్యలకు ముఖ్యమంత్రి పాల్పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అనవసరమైన విషయాల మీదనే కెసిఆర్ దృష్టి పెడుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలకు, రైతులకు మేలు జరుగుతుందని ఆశించామని, వారి ఆశలు అడియాసలు అయ్యాయని ఆయన అన్నారు.
మంత్రివర్గ సమావేశంలో కెసిఆర్ భజన, ఆయన బంగ్లాల గురించే చర్చ జరిగిందని రేవంత్ రెడ్డి అన్నారు. కెసిఆర్ ఫ్యూడల్ మనస్తత్వంతో ఉన్నారనడానికి, అధికార మదంతో ఉన్నదనడానికి ఇది నిదర్శనమని ఆయన అన్నారు. మంత్రి హరీష్ రావు బెదిరింపులకు భయపడేది లేదని ఆయన అన్నారు. హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపిస్తే తాను హరీష్ రావుపై చేసిన ఆరోపణలను రుజువు చేస్తానని ఆయన అన్నారు. హరీష్ రావుది, ఆయన మామ కెసిఆర్ది రోజుకో వ్యవహారం బయటపెడుతానని రేవంత్ రెడ్డి అన్నారు.