మాట్లాడనివ్వట్లేదు, వాస్తు చూసి జీవో: కేసీఆర్పై రేవంత్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన సోమవారం తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. శాసన సభలో డీఎల్ఎఫ్ భూముల పైన రేవంత్ రెడ్డి మాట్లాడేందుకు లేవగా.. క్షమాపణ చెప్పాక సభలో తెరాస సభ్యులు నినాదాలు చేశారు. దీంతో ఇంతటితో ముగిస్తున్నానని సభాపతి మధుసూదనా చారి సభను అరగంట పాటు వాయిదా వేశారు. అనంతరం రేవంత్ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.
కేసీఆర్ సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. డీఎల్ఎఫ్ భూముల పైన అక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లింది తానని, ఆరోపణలు చేసిన తనకు చర్చకు అవకాశం కల్పించడం లేదని మండిపడ్డారు. వాస్తవాలు బయటకు వస్తాయనే తెలుగుదేశం పార్టీ సభ్యులను వారం రోజుల పాటు ఇటీవల సస్పెండ్ చేశారన్నారు.
ఇప్పుడు తాను చేసిన ఆరోపణలు నిజమని తేలాయన్నారు. భూకేటాయింపులు కేసీఆర్ వచ్చాకనే జరిగాయన్నారు. తన బంధువుకు ముట్టజెప్పేందుకు కేసీఆర్ ఆయనకు కూడా లక్కీ నెంబర్ చూశారని ఆరోపించారు. డీఎల్ఎఫ్ భూముల పైన తొలి నుండి పోరాడింది టీడీపీయేనన్నారు. ఈ అంశం పైన తమకు మాట్లాడే హక్కు ఉందన్నారు. తెరాస తనను మాట్లాడనివ్వడం లేదన్నారు.
ఏపీఐఐసీ భూములు అమ్ముకోవడానికి కాదని, యువతకు ఉద్యోగాలు చూపించాలన్నారు. భూముల అక్రమాల వల్ల ప్రభుత్వానికి రూ.253 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. కేసీఆర్ తన వైఖరి మార్చుకోవాలన్నారు. కేసీఆర్ వాస్తు, న్యూమరాలజీ చూసుకొని తన లక్కీ నెంబర్ వచ్చేలా జీవో నెంబర్ 6 విడుదల చేశారన్నారు.
అంతకుముందు సభలో కాంగ్రెస్ సభ్యుడు భట్టి మాట్లాడిన విషయం తెలిసిందే. భూ కేటాయింపులతో తమకు సంబంధం లేదని ప్రభుత్వం అనడం సమంజసం కాదన్నారు. ఈ ఆరోపణలపై ఇంకా తమకు అనుమానాలున్నాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాతే భూములను రిజిస్టర్ చేశారన్నారు. వాస్తవాలేంటో ప్రజలకు వివరించాలని, గత ప్రభుత్వం న్యాయబద్ధంగా చేసిందో, లేదో చెప్పాలన్నారు. కానీ సంబంధం లేదని సీఎం అంటున్నారని, తనపై అసహనం వ్యక్తం చేశారన్నారు.
దీనిపై కేసీఆర్ మాట్లాడుతూ.. గత కాంగ్రెస్ సర్కారు తప్పు చేసిందని తాను ఎక్కడా చెప్పలేదని, సర్కారు బహిరంగ వేలం వేయగా, ఆ వేలంలో డీఎల్ఎఫ్ మాత్రమే పాల్గొందని చెప్పానని తెలిపారు. ఆరోపణల్లో అబద్దాలు ఉన్నాయని మాత్రమే తాను అన్నానని, సభాపతి ఆదేశిస్తే మొత్తం ఫైళ్లన్ని సభ ముందు పెడతానన్నారు. సాధారణంగా ఎవరూ నోట్ ఫైళ్లను సభ ముందు తీసుకు రారన్నారు.
ఏపీఐఐసీ చేసిన పొరపాట్ల వల్ల లోపాలు జరిగాయన్నారు. ఓ మంత్రి రాసిన నోట్ ఫైల్ సభ ముందు పెట్టడం సభ్యత కాదన్నారు. పూర్వాంకర్ అనే సంస్థ ఇప్పుడు హైకోర్టులో కేసు వేసిందని, నాటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో లోపం వల్లే ఈ భారం పడుతోందన్నారు. వాళ్ల వాదన నెగ్గితే వడ్డీతో కలిపి రూ.900 కోట్లు కట్టాలన్నారు. సభ్యుల మనసు గాటపడేలా ఒక్క మాట మాట్లాడలేదన్నారు.