బాబు కితాబు, ముఖేష్ అంబానీ విరాళం రూ.11కోట్లు
హైదరాబాద్/విశాఖ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం సాయంత్రం హైదరాబాదు రానున్నారని తెలుస్తోంది. హుధుద్ తుఫాను విలయం నేపథ్యంలో గత కొద్ది రోజులుగా చంద్రబాబు విశాఖలోనే ఉంటున్నారు. పరిస్థితులను చక్కదిద్దుతున్నారు.
ఆదివారం పలు ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. ఎన్టీఆర్ హయాం నుండే ఉత్తరాంధ్ర టీడీపీకీ కంచుకోట అన్నారు. ఈ నెల 23వ తేదీన బీచ్ రోడ్డులో తుఫాన్ను జయిద్దాం పేరుతో ర్యాలీ తీయనున్నట్లు చెప్పారు. ఉద్యోగులు, అధికారులు అద్భుతంగా పని చేశారని కితాబిచ్చారు.
హుధుద్ తుపాను వల్ల విద్యుత్ శాఖకు రూ.1200 కోట్లు నష్టం వాటిల్లిందని చంద్రబాబు వెల్లడించారు. తుపాను ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్దరణకు 13 వేల మంది ఇంజనీర్లు కష్టపడుతున్నారని, ఇప్పటి వరకు 30 వేల విద్యుత్ స్తంభాలను సమీకరించామన్నారు.
నిత్యావసర సరుకులు పొందడం బాధితుల హక్కు అన్న బాబు ఏ గుర్తింపు కార్డు చూపించినా డీలర్లు సరుకులు ఇవ్వాలని ఆదేశించారు. తుపాను ప్రాంతాల్లో 14 లక్షల కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేస్తున్నట్లు తెలిపారు.
అంతకుముందు, తుపాను ప్రాంతాల్లో సహాయక చర్యలపై చంద్రబాబు ఆదివారం కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. తుపాను ప్రాంతాల్లో త్వరితగతిన సహాయక చర్యలు చేపట్టిన టీడీపీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను చంద్రబాబు అభినందించారు. ఈ సందర్భంగా చెట్లను నరికివేసే అత్యాధునిక యంత్రాన్ని ప్రారంభించారు.
కాగా, విశాఖ పర్యాటక రంగానికి రూ.150 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. తక్షణ సాయంగా రూ.50 కోట్లు అవసరమని ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ చందనఖాన్ తెలిపారు. ఈ నెల 25వ తేదీ నుండి పర్యాటక ప్రాంతాలలో మళ్లీ కార్యకలాపాలు కొనసాగిస్తామన్నారు.
ఉత్తరాంధ్రలో రాహుల్ గాంధీ పర్యటన
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విజయనగరం జిల్లా భోగాపురం మండలం తూడెం గ్రామంలో తుపాను బాధితులను పరామర్శించారు. తుపాను కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు రాహుల్ రూ.లక్ష చొప్పున చెక్కులు అందించారు. ఏ కష్టమొచ్చినా తొలుత పేదవాడే నష్టపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
బాధితులకు అండగా ఉంటామని, వారికి పూర్తిస్థాయిలో సాయం అందేంతవరకు కేంద్రంతో పోరాడతామని హామీ ఇచ్చారు. కష్టాలను తెలుసుకునేందుకే తాను వచ్చానని తెలిపారు. కాంగ్రెస్ ఎప్పుడు కూడా బలహీనవర్గాల వారికి అండగా ఉంటుందన్నారు. బట్టలు, ఆహార పదార్థాలు పంచాలని రాహుల్ గాంధీ పార్టీ నాయకులకు సూచించారు.
రూ. 11 కోట్ల విరాళం ప్రకటించిన ముఖేష్
హుధుద్ తుపాను బాధితుల సహాయార్థం ప్రముఖ పారిశ్రామిక వేత్తలు భారీ విరాళాలను ప్రకటిస్తున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తుపాను సహాయక చర్యల కోసం రూ.11 కోట్ల విరాళం ప్రకటించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని చెప్పారు.
రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి
కృష్ణా జిల్లాలోని కేదారేశ్వరపేటలోని ఎర్రకట్ట వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. బైక్-లారీ ఢీకొనడంతో ఈప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.