రిషికేశ్వరి మృతిపై చెప్పండి: బాలసుబ్రహ్మణ్యం, రక్షించేయత్నాలు! ఆరోజేం జరిగింది?
హైదరాబాద్: గుంటూరు జిల్లాలోని నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న రిషికేశ్వరి కేసులో ఎవరి వద్దనైనా సమాచారం లేదా ఆధారాలు ఉంటే తమకు అందజేయాలని రిషికేశ్వరి మృతిపై విచారణ జరుపుతున్న కమిటీ సభ్యులు, విశ్రాంత ఐఏఎస్ అధికారి బాలసుబ్రమణ్యం బుధవారం తెలిపారు.
ఇప్పటికే ఈ మెయిల్ ద్వారా కొంత సమాచారాన్ని సేకరించామన్నారు. విద్యార్థుల వద్ద సమాచారం ఉంటే తమకు చెప్పాలని కోరామన్నారు. బుధవారం నాడు విశ్వవిద్యాలయంలో బాలసుబ్రమణ్యం నేతృత్వంలో అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఉపకులపతి, రిజిస్టార్తో ఏర్పాటైన కమిటి విచారణ జరుపుతోంది.
విద్యార్థుల నుంచి సమాచారం సేకరిస్తోంది. ఎవరి వద్ద ఆధారాలు ఉన్నా తమకు అందించాలని చెబుతున్నారు. సమగ్ర నివేదికను త్వరలో ప్రభుత్వానికి అందజేస్తామని బాలసుబ్రహ్మణ్యం చెప్పారు.
కాగా, ర్యాగింగ్ను వ్యతిరేకిస్తూ విద్యార్థులు నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో బుధవారం నాడు పోస్టర్లు అతికించారు. పలు వర్సిటీల్లో యాంటీ ర్యాగింగ్ పోస్టర్లు వెలిశాయి. యూనివర్సిటీలో తాను ఎదుర్కొన్న ర్యాగింగ్ పరిస్ధితులను కూడా రిషికేశ్వరి ఆ డైరీలో రాసుకున్నట్లు విషయం తెలిసిందే. అది బయటకు వచ్చింది.
బుధవారం నాడు నాగార్జున వర్సిటీ కళాశాలల తరగతులు, వసతి గృహాలు ప్రారంభమయ్యాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.
రిషికేశ్వరి మృతికి కారకులైన వారిని శిక్షించాలని విద్యార్థులు డిమాండ్ చేసిన నేపథ్యంలో పది రోజుల సెలవు ఇచ్చారు. అనంతరం తెరుచుకుంది. బయటి వ్యక్తులను లోనికి రానీయకుండా ఆంక్షలు విధించారు. గుర్తింపు కార్డు ఉన్న వారినే లోపలకు అనుమతిస్తున్నారు.
రిషికేశ్వరి డైరీ వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఆమె తండ్రి మురళీ కృష్ణ మాట్లాడుతూ... ఆ లెటర్ తమకు చూపించలేదని ఆరోపించారు. నిందితులను రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని దీని ద్వారా అర్థమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రిషికేశ్వరి డైరీని తమకు హ్యాండోవర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. డైరీలో నిందితుల పేర్లు ఉంటే, వాటిని పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేశారన్నారు.
14న ఏం జరిగింది?
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన రిషికేశ్వరి హత్యకు దారితీసిన కారణాలను వెలికితీసేందుకు గుంటూరు అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ్ త్రిపాఠి స్వయంగా రంగంలోకి దిగారు. తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్న ఒక సీనియర్, నలుగురు జూనియర్ విద్యార్థులను డీఎస్పీ ఆఫీసులో రెండు గంటల పాటు ఆయన ప్రశ్నించారు.
రిషికేశ్వరి డైరీలో పేర్లను చెరిపేసింది ఎవరు? ఆమె ఆత్మహత్య చేసుకున్న జూలై 14 రాత్రి ఏం జరిగింది? వంటి ప్రశ్నలను ఆయన సంధించినట్టు పోలీసు వర్గాల సమాచారం.
ఆ రోజు రాత్రి రిషికేశ్వరి రాత్రి పదకొండు గంటల సమయంలో హాస్టల్కు వచ్చిందని, హాస్టల్లో ఆహారం లేకపోవడంతో ఆమె బంధువు ఫుట్ పార్సిల్ తెచ్చి సెక్యూరిటీ చేతికి ఇచ్చిందని విచారణలో వెల్లడైనట్లుగా తెలుస్తోంది.
హాస్టల్ ప్రధాన ద్వారం వద్దకు వచ్చిన ఆమె భోజనం పార్సిల్ తీసుకుని తన గదికి వెళ్లే సమయంలోనే ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించిన ఘటనలు జరిగాయని పోలీసులు భావిస్తున్నారని తెలుస్తోంది. ఆ రోజు ఉదయం నుంచి హాస్టల్లో ఏం జరిగిందన్నది విద్యార్థులను అడిగి తెలుసుకుంటున్నారు.
గతంలో అదుపు తీసుకున్న ముగ్గురు సీనియర్లతో పాటు మరో ఇద్దరు విద్యార్థులకూ ఘటనలో ప్రమేయమున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైందని సమాచారం.
ఈ సంఘటన వెనుక కాలేజీ ప్రిన్సిపాల్ బాబూరావు హస్తం పైనా పోలీసులు విచారిస్తున్నారు. ఆమె మృతదేహాన్ని చూసిన విద్యార్థినులు తొలుత బాబూరావుకు సమాచారం ఇవ్వగా, పోలీసులు రాకముందే ఆమె మృతదేహాన్ని ఎందుకు తరలించారన్న విషయమై ఆరా తీస్తున్నారు.