రిషికేశ్వరి ఆత్మహత్య: 50 మంది బయటివారు, అందుకే సెలవులన్న విసి
గుంటూరు: విద్యార్థిని రిషికేశ్వరి ఆత్మహత్య నేపథ్యంలో నాగార్జున విశ్వవిద్యలయానికి సెలవులు ప్రకటించిడంపై వివాదం చెలరేగుతోంది. ఈ స్థితిలో సెలవులు ప్రకటించడానికి కారణాన్ని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ కెఆర్ఎస్ సాంబశివరావు వివరించారు.
విశ్వవిద్యాలయం ప్రాంగణంలో సుమారు 50మంది బయటి వ్యక్తులు ఉన్నట్లు గుర్తించామని ఆయన తెలిపారు. విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్చర్ మొదటి సంవత్సరం విద్యార్థిని రిషికేశ్వరి ఆత్మహత్యకు కారణాలను అన్వేషిస్తున్న నేపథ్యంలో చోటుచేసుకుంటున్న ఘర్షణలను నిలువరించేందుకు పది రోజులు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.
హాస్టళ్లలో బయటి వ్యక్తులు నివాసముంటున్నారనే అనుమానంతో సెలవులు ప్రకటించామని విసి చెప్పారు. పోలీసులు పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాటుచేసి హాస్టళ్లలో ఉంటున్న బయటి వ్యక్తులతో పాటు విద్యార్థులను పంపించివేశారు.
ప్రస్తుతం ప్రాంగణంలోకి ప్రవేశించాలంటే తప్పనిసరిగా గుర్తింపు కార్డును చూపించాలని పోలీసు అధికారులు షరతు విధించారు. విశ్వవిద్యాలయ కమిటీ సభ్యులు రిషితేశ్వరి ఆత్మహత్యకు సంబంధించిన దర్యాప్తు నివేదిక త్వరలో అందుతుందని తెలిపారు. అనంతరం ప్రభుత్వానికి నివేదిక అందజేసి తదుపరి చర్యలు తీసుకుంటామని వైస్ చాన్సరల్ సాంబశివరావు వివరించారు.