బాబు మీద కెసిఆర్ పైచేయి: కృష్ణా బోర్డు నుంచి గుప్తా ఔట్
న్యూఢిల్లీ: కృష్ణా నదీ జలాల వివాదం విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మీద తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పైచేయి సాధించినట్లే కనిపిస్తున్నారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కెఆర్ఎంబీ) సభ్య కార్యదర్శి పదవి నుంచి ఆర్కె గుప్తాను తొలగిస్తూ కేంద్ర జలవనరుల శాఖ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖ మూలంగానే ఆయనకు ఉద్వాసన పలికినట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రాజెక్టుల నియంత్రణ విషయంలో గుప్తా వ్యవహార శైలి వల్లనే తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు చోటు చేసుకుంటున్నాయని, ఆయనను పదవి నుంచి తొలగించాలంటూ తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖపై కేంద్రం ఆ నిర్ణయం తీసుకుంది. గోదావరి బోర్డు సభ్య కార్యదర్శిగా న్న సమీర్ ఛటర్జీ గుప్తా స్థానంలో నియమితులయ్యారు.
కేంద్ర జల సంఘం చీఫ్ ఇంజనీర్ అయిన గుప్తా మొదటి నుంచి కూడా కృష్ణా బోర్డు సభ్య కార్యదర్సిగా ఉన్నారు. దీంతో పాటు తుంగభద్ర బోర్డు చైర్మన్గా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్య కార్యదర్శిగా ఉన్నారు. కృష్ణా జలాల నీటి వినియోగం, విడుదలకు సంబంధించి గుప్తా నిర్ణయాల మేరకే ఆదేశాలు వెలువడుతూ వచ్చాయి.
నీటి పంపకాల్లో గుప్తా మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనుకూలంగా ఉన్నారంటూ తెలంగాణ ప్రభుత్వం మండిపడుతోంది. అయితే, నేరుగా ఎప్పుడూ కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయలేదు. ఇటీవల కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులను బోర్డు నియంత్రణలోకి తెచ్చుకునే విషయంలో గుప్తా కాస్తా మొండిగా వ్యవహరించారు.
ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులు లేవని, అందువల్ల ప్రాజెక్టులపై బోర్డు నియంత్రణ అవసరం లేదని పలు వేదికలపై తెలంగాణ ప్రభుత్వం వాదిస్తూ వస్తోంది. అయితే, గుప్తా ఆ వాదనలను బేఖాతరు చేస్తూ డ్రాఫ్ట్ నోటిఫికేన్ రూపొందించి, దాన్ని ఆమోదించాలని నేరుగా కేంద్రానికి లేఖ రాశారు. దాంతో తెలంగాణ ప్రభుత్వం గుప్తాపై కేంద్రానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.