రాజమౌళిని మించిపోయారు, అందుకే జగన్ వెళ్లలేదు: బాబును ఏకేసిన రోజా
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై మాయల మరాఠీ అంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజెంటేషన్ పేరుతో అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబునాయుడు మరో డ్రామాకు తెరలేపారని .
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై మాయల మరాఠీ అంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజెంటేషన్ పేరుతో అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబునాయుడు మరో డ్రామాకు తెరలేపారని మండిపడ్డారు. ఏపీ రాజధానిని సింగపూర్లా కడతామంటూ గ్రాఫిక్స్ చూపించి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.
శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రోజా మాట్లాడారు. తాజాగా రాజధాని నిర్మాణంపై ప్రజెంటేషన్ ఇవ్వడంపై స్పందిస్తూ.. సింగపూర్ డిజైన్లను గాలికి వదిలేశారా? అని ప్రశ్నించారు. గ్రాఫిక్స్ మాయజాలంతో మాయల మరాఠీల వ్యవహరిస్తున్నారు కాబట్టే వైసీపీ అధినేత వైయస్ జగన్ ఆ ప్రజంటేషన్కు వెళ్లలేదని రోజా చెప్పారు.
మాకీ సంస్థతో ఒప్పందాలు చేసుకుని మరో సంస్థకు మార్చడం వెనుక మతలబు ఏంటో చెప్పాలన్నారు. ఎవరితోనూ చర్చించకుండానే చంద్రబాబు రాజధానిని ఎంపిక చేశారని, ఆనాడు రాజధాని ఎంపిక విషయంలో ప్రతిపక్షాన్ని, అఖిలపక్షాన్ని ఎందుకు పిలవలేదని రోజా ప్రశ్నించారు.
రాజధానిలో డిజైన్లలో 51శాతం గ్రీనరీకి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పుకునే చంద్రబాబు.. మూడు పంటలు పండే 33వేల ఎకరాల భూమిని లాక్కుని ఎక్కడ నుంచో తెచ్చి చెట్లు పెడతామని చెవిలో కాలీఫ్లవర్లు పెడుతున్నామని రోజా ఎద్దేవా చేశారు. ప్రస్తుత రాజధానిలో ఒక్క చెట్టు కూడా లేదని, ఇక మహిళా మంత్రులు, ప్రతినిధులు వెళ్లేందుకు టాయిలెట్లు కూడా లేని దౌర్భగ్య స్థితిలో ఉన్నామని అన్నారు.
మొదట సింగపూర్ డిజైన్లు, తర్వాత పొగ గొట్టాల డిజైన్లను తెరమీదకు తెచ్చారని.. తాజాగా ఫోస్టర్ సంస్థ డిజైన్లపై ప్రజెంటేషన్ ఇస్తున్నారని ఎమ్మెల్యే రోజా అన్నారు. దీన్ని కూడా ఖరారు చేస్తారో లేదో తెలియదన్నారు. గతంలో సింగపూర్ సంస్థతో కుదుర్చుకున్న సీల్డ్ కవర్ ఒప్పందాన్ని అసెంబ్లీలో ఎందుకు బయటపెట్టలేదని రోజా డిమాండ్ చేశారు.
రాజధాని డిజైన్లలో ఏపీ సర్కారు తమతో ఒప్పందం రద్దు చేసుకోవడంపై మాకీ సంస్థ కేంద్రానికి ఫిర్యాదు చేసిందని రోజా అన్నారు. దానిపై ముఖ్యమంత్రి ఎందుకు నోరుమెదపడం లేదని ప్రశ్నించారు. ప్రజలకు చూపించాల్సింది బొమ్మలు కాదని, శాశ్వత రాజధాని డిజైన్లను సభలో ప్రదర్శించాలని రోజా డిమాండ్ చేశారు.
'బాహుబలి' గ్రాఫిక్స్ చూపిస్తున్నారు...
ఇంకా ఖరారు కాని డిజైన్లను చూపించడం కోసం శాసనసభా సమావేశాల సమయాన్ని వృథా చేస్తున్నారని ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. బాహుబలి చిత్రంలో మాదిరిగా గ్రాఫిక్స్ చూపించి ప్రభుత్వం ప్రజలను మభ్య పెడుతోందని ఆమె విమర్శించారు. రాజమౌళి బాహుబలి2 దగ్గరే ఉంటే.. చంద్రబాబు మాత్రం బాహుబలి 3 వరకు వెళ్లారని ఎద్దేవా చేశారు.
ప్రజా సమస్యలపై చర్చించకుండా సభను వాయిదా వేస్తున్నారని రోజా మండిపడ్డారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని అన్నారు. ధరల స్థిరీకరణకు రూ.5వేల కోట్లు కేటాయిస్తామని చెప్పిన చంద్రబాబు.. 5రూపాయలు కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. రైతులు, మహిళలు, యువతను చంద్రబాబు మోసం చేశారని అన్నారు. ఇది ఇలా ఉండగా, రక్తహీనతతో అనేక మంది గిరిజనులు మరణిస్తున్నారని గిడ్డి ఈశ్వరి చెప్పారు. గిరిజనుల మరణాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.