లోకేష్ తీరు జబర్దస్త్ షోని మించింది: బాలకృష్ణ, బాబులపైనా రోజా సెటైర్లు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమత్తారు. చంద్రబాబునాయుడు ఏ ఎన్నికల హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు.
తండ్రి, మామ ఇలాకాలో ప్రజల కష్టాలు
రాష్ట్రంలో రైతులు, ప్రజలు తీవ్రమైన నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారని అన్నారు. లోకేష్ తండ్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనూ, మామ బాలకృష్ణ సొంత నియోజకవర్గం హిందూపురంలోనూ ప్రజలు తీవ్రమైన నీటి కష్టాలను పడుతున్నారని రోజా అన్నారు.
కరువు జిల్లాలో వేడుకలా?
వైయస్సార్ కాంగ్రెస్ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై అవాకులు చెవాకులు పేలుతున్నారంటూ లోకేష్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరువుతో అల్లాడుతున్న అనంతపురంలో చంద్రబాబునాయుడు పుట్టిన రోజు వేడుకలు చేసుకుంటారా? అని నిలదీశారు.
లోకేష్పైనే కేసులు పెట్టాలి..
సోషల్ మీడియాలో ప్రభుత్వంపై విమర్శిస్తే కేసులు పెడుతున్నారని ఆరోపించిన రోజా.. ఏ కేసులేమైనా పెడితే అవి లోకేష్ పైనే పెట్టాలని రోజా అన్నారు. చంద్రబాబు మూడేళ్ల పాలనలో రాష్ట్రానికి కరువు ఇచ్చారంటూ ఎద్దేవా చేశారు.
అలాంటి వ్యక్తి మంత్రి పదవా?
ఇంటికో ఉద్యోగమని హామినిచ్చిన చంద్రబాబునాయుడు తన ఇంట్లో మాత్రం ఉద్యోగమిచ్చుకున్నారని చురకంటించారు. వర్ధంతికి జయంతికి తేడా తెలియని లోకేష్కు మంత్రి పదవి ఇచ్చారంటూ రోజా ఎద్దేవా చేశారు.
ఏపీ తాగునీటి ఎద్దడి తెస్తానని అల్లుడు నారా లోకేష్ చెప్పగానే.. ఆయన మామ బాలకృష్ణ తన నియోజకవర్గం హిందూపురంలో అమలు చేశారని రోజా ఎద్దేవా చేశారు. లోకేష్ తీరు జబర్దస్త్ కామెడీ షోను మించిపోయిందని ఆమె వ్యాఖ్యానించారు. తాగునీటి సమస్యను సృష్టించడానికే మంత్రిని అయ్యానని చెప్పి లోకేష్ తన మనసులో మాటను బయటపెట్టారని రోజా అన్నారు.
కుప్పం, హిందూపురంలోనే నీళ్లు లేకుండా చేశారని విమర్శించారు. తాగునీటి కోసం హిందూపురంలో ధర్నా చేసే పరిస్థితి వచ్చినందుకు అధికార పార్టీ నాయకులు సిగ్గుపడాలని అన్నారు. ప్రతీ మాటలోనూ తప్పులు దొర్లుతున్నా.. తమ మాటలను కంట్రోల్ చేసుకోలేని చినబాబు సోషల్ మీడియాను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సోషల్ మీడియాపై కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు.
చంద్రబాబు పాలన గురించి మూడు ముక్కల్లో చెప్పాలంటే ముడుపులు, మోసాలు, అరాచకాలుగా పేర్కొనవచ్చని రోజా విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. ఆరువందల హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని అన్నారు. పేదలకు పక్కా ఇళ్లు కట్టిస్తామని చెప్పి.. పక్క రాష్ట్రంలో ఇంద్రభవనం నిర్మించుకున్నారని మండిపడ్డారు.