కడపలో రోజా షాపింగ్: జగన్ పార్టీ కీలక నేతకు టీడీపీ గాలం!
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో షాకిచ్చేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోంది. కర్నూలు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా పనిచేసిన సుబ్బారెడ్డిని టీడీపీలోకి లాగే ప్రయత్నాలు.
కర్నూలు/కడప: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో షాకిచ్చేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోంది. కర్నూలు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా పనిచేసిన సుబ్బారెడ్డిని టీడీపీలోకి లాగే ప్రయత్నాలు సాగుతున్నట్లు తెలిసింది. వైసీపీ ఎమ్మెల్యే రాజారెడ్డి(బుగ్గన రాజేంద్ర రెడ్డికి సుబ్బారెడ్డికి మధ్య చాలా కాలంగా కోల్డ్ వార్ నడుస్తోంది.
వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఏకంగా వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగినా ఫలితం లేకుండాపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో వీరి మధ్య విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో సుబ్బారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ప్రకటించారు.
ఈ క్రమంలో రంగంలోకి దిగిన టీడీపీ సుబ్బారెడ్డిని తమ పార్టీలోకి తీసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే డోన్ నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ ఈ ప్రతాప్ సన్నిహితులు సుబ్బారెడ్డితో చర్చలు జరిపినట్లు తెలిసింది. అంతేగాక, టీడీపీలో చేరితే సముచిత స్థానం కల్పిస్తామంటూ హామీ కూడా ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వ్యవహారం స్థానికంగా హాట్ టాపిక్గా మారింది.
కడపలో రోజా షాపింగ్
బుధవారం ఒంటిమిట్ట కోదండ రామాలయానికి వచ్చి బ్రహ్మోత్సవాల ప్రారంభ వేడుకల్లో పాల్గొన్న వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా.. అక్కడికి దగ్గరలో ఉన్న మాధవరంలో పట్టు చీరలను కొన్నారు. ఇక్కడి చీరల గొప్పతనాన్ని స్థానిక కార్యకర్తల నుంచి తెలుసుకున్న ఆమె.. స్వయంగా మాధవరం వెళ్లి చీరలు కొనుగోలు చేశారు. ఇక్కడి చీరలు చాలా బాగున్నాయని, తనకు నచ్చాయని రోజా వ్యాఖ్యానించారు. ఈ చీరలకు మరింత ప్రాచుర్యం తెచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు.