ఎయిర్పోర్టులో రోజా నిర్బంధం: అదుపులోకి తీసుకున్న పోలీసులు, తరలింపు
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాను గన్నవరం విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నారు. బౌద్ధ గురువు దలైలామా అక్కడకు వస్తున్నారన్న కారణంతోనే ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు.
మహిళా పార్లమెంటేరియన్ సదస్సుకు ఆహ్వానించడంతో రోజా శనివారం గన్నవరం చేరుకున్నారు. అయితే, ఎయిర్ పోర్టులో పోలీసులు రోజాను అడ్డుకున్నారు. విమానాశ్రయంలో దిగగానే పోలీసులు ఆమెను అడ్డుకుని ఓ గదిలో బంధించారు. ఆమె చుట్టూ పోలీసులు మోహరించి బయటకు వెళ్లేందుకు కూడా అనుమతి ఇవ్వలేదు.
దాదాపు గంటసేపు విమానాశ్రయంలోనే నిర్బంధించి.. ఆ తర్వాత పోలీసులు తమ బందోబస్తుతో రోజాను విజయవాడకు తరలించారు. కాగా, రోజా వాహనంలో తరలిస్తుండగా ఓ సెల్ఫీ వీడియో తీసి పంపడంతో ఈ విషయం వెలుగుచూసింది.
కాగా, ఎమ్మెల్యే రోజాను పేరేచర్ల పోలీస్ స్టేషన్కు తరలించినట్లు తెలిసింది. ప్రభుత్వ అధికారులే మహిళా సదస్సుకు రమ్మంటూ రోజాను ఆహ్వానించి.. తీరా సదస్సు కోసం విమానాశ్రయం వరకు వచ్చిన తర్వాత అడ్డుకోవడం ఏంటని వైయస్సార్ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. రోజాను కిడ్నాప్ చేశారంటూ ఆరోపణలు చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్ మండిపడ్డారు. ఈ ఘటనపై డీజీపీని నిలదీస్తామని చెప్పారు. కాగా, మహిళా పార్లమెంటేరియన్ సదస్సు దగ్గర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేస్తారన్న అనుమానంతోనే రోజాను అరెస్ట్ చేసినట్లు తెలిసింది.