స్కూల్ బస్సు-ఆటో ఢీ: ఇద్దరు మృతి, 10మందికి గాయాలు
నెల్లూరు: జిల్లాలోని చిల్లకూరు మండలం తీపనూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పాఠశాల బస్సు-ఆటో ఢీకొన్నాయి. ఘటనలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండగా, 10మంది విద్యార్థులకు గాయాలయ్యాయి.
గాయాలపాలైన విద్యార్థులను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రి వైద్యులు విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు.
విజయవాడలో ఉద్రిక్తత
విజయవాడ: నగరంలోని చిట్టినగర్లోని వృద్ధులు, వితంతువుల పింఛను కేంద్రంలో అపశృతి చోటుచేసుకుంది. పింఛను కోసం వెళ్లిన ఓ వృద్ధురాలు అక్కడ జరిగిన స్వల్ప తొక్కిసలాటలో మృతి చెందింది. అధికారులు సరైన ఏర్పాటు చేయని కారణంగానే తొక్కిసలాట జరిగి వృద్ధురాలు మృతి చెందిందని వృద్ధురాలు, పలు పార్టీ నాయకులు రోడ్డుపై ఆందోళనకు దిగారు.
వివరాల్లోకి వెళితే.. శాంతమ్మ(60) అనే వృద్ధురాలు పింఛను కోసం చిట్టినగర్లోని పింఛను అందజేసే కేంద్రం వద్దకు వెళ్లింది. అధికారులు కేంద్రం గేట్లు తీయకపోవడంతో అక్కడే చాలా మంది వృద్ధులు చేరుకున్నారు. గేటు తీయడంతో ఒక్కసారిగా వృద్ధులందరూ లోనికి రావడంతో స్వల్ప తొక్కసలాట జరిగింది. కిందపడిపోయిన శాంతమ్మ అక్కడికక్కడే మృతి చెందింది.
అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన వృద్ధులు, వితంతువులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, వృద్ధురాలిని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.