బాబును కాలకేయ, భల్లాల, కట్టప్పలతో పోల్చిన రోజా ఉద్వేగం, అల్లకల్లోలమే..
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా బుధవారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబును బాహుబలి సినిమాలోని కాలకేయుడు, భల్లాలదేవుడితో పోల్చి నిప్పులు చెరిగారు.
చంద్రబాబు కాలకేయుడి మాదిరిగా రాష్ట్ర ప్రజల పైన దాడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రన్న పాలన అరాచక పాలనగా మారిందన్నారు. ఆయన పాలన చూస్తుంటే భల్లాలదేవ పాలన కనిపిస్తోందని విమర్శించారు. చంద్రబాబు పాలనలో మహిళలు, విద్యార్థినులు, ప్రజల పైన దాడులు జరుగుతున్నాయన్నారు.
గుంటూరు జిల్లాలో వైయస్ జగన్ నిరహార దీక్ష వద్ద అమె ఉద్వేగంగా ప్రసంగించారు. రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచిన కట్టప్ప ఈ చంద్రబాబు అన్నాడు. నాడు పిల్లను ఇచ్చిన మామకు, ఇప్పుడు నమ్మి ఓట్లేసిన ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు.
కాలకేయుడిలా ప్రజల మీద దండయాత్ర, భల్లాలదేవుడిలా అరాచక పాలన, కట్టప్పలా వెన్నుపోటు పొడుస్తున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలన్నారు. ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు లేదా ఆయన భజన బ్యాచ్ మాట్లాడదని నిప్పులు చెరిగారు.
పట్టిసీమలో మోటార్లు కూడా లేకుండా చేసిన దౌర్భాగ్యపు మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. ఒక్క పంపు తెరిస్తేనే అక్విడెక్టు కొట్టుకుపోయిందని, మొత్తం పంపులు తెరిస్తే టిడిపి నాయకులే కొట్టుకుపోతారని ఎద్దవా చేశారు.
చంద్రబాబు పాలనలో జిల్లాకో సైకో సూదిగాడ్ని తయారు చేశారన్నారు. గాలి గాళ్లు, దూళిగాళ్లు తయారయ్యారన్నారు. టిడిపిలో అందరూ సైకోలుగా తయారయ్యారని, తద్వారా రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారన్నారు.
చంద్రబాబు కొడుకు లోకేష్, మంత్రులు, ఎమ్మెల్యేలు కందిపపపు నుంచి బంగారం వరకు దేనినీ వదలడం లేదన్నారు. ప్రత్యేక హోదా రాకుంటే రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తారనే సంగతి గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.
ప్రతి గ్రామంలో మండలంలో, నియోజకవర్గంలో ప్రత్యేక హోదా పోరు ప్రారంభించి టిడిపి వెన్నులో వణుకు పుట్టిస్తామన్నారు. ఈ సైకో పార్టీని, సూదిగాళ్లను నిలదీసి ఎక్కడా తిరగనివ్వవద్దన్నారు. ప్రత్యేక హోదాతో రాష్ట్రానికి 90 శాతం గ్రాంట్ నిధులు వస్తాయన్నారు.
ప్రత్యేక హోదా ఏపీ హక్కు అన్నారు. పార్లమెంటు ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. ప్రత్యేక హోదాతో ఉత్తరాఖండ్ స్వరూపమే మారిందన్నారు. హిమాచల్ ప్రదేశ్ వేగంగా అభివృద్ధి చెందిందన్నారు. చంద్రబాబు, ఆయన మంత్రులు పదవులకు గబ్బిలాల్లా వేలాడుతూ రాష్ట్రాన్ని నడిరోడ్డున పడేస్తున్నారన్నారు.
ప్రత్యేక హోదా కోసం పోరాడమంటే తమ జేబులు నింపుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీకితెరలేపారన్నారు. విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని ఈ 15 నెలల కాలంలో అమలు చేయలేదన్నారు. హోదా కోసం ఉద్యమాన్ని ఉధృతం చేయాలన్నారు.