బాబును దింపేసి, బాలకృష్ణకు పదవి: కొత్త డిమాండ్, రాయపాటి అలక.. మహానాడుకు డుమ్మా
టిడిపి అధ్యక్ష పీఠం నుంచి చంద్రబాబు నాయుడును దించేసి, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు అప్పగించాలని వైసిపి నగరి ఎమ్మెల్యే రోజా ఆదివారం కొత్త అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చారు.
అమరావతి: టిడిపి అధ్యక్ష పీఠం నుంచి చంద్రబాబు నాయుడును దించేసి, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు అప్పగించాలని వైసిపి నగరి ఎమ్మెల్యే రోజా ఆదివారం కొత్త అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చారు. ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
చదవండి: 'నందమూరి ఫ్యామిలీకి చంద్రబాబు అవమానం'
అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఎన్టీఆర్ ఆశయాలను చంద్రబాబు తుంగలో తొక్కారన్నారు. విశాఖలో జరుగుతున్నది టిడిపి మహానాడు కాదని, వెన్నుపోటు వార్షికాలని ఎద్దేవా చేశారు. ఎన్నికలలో ఇచ్చిన ఒక్క హామీని చంద్రబాబు నెరవేర్చలేదని ఆరోపించారు.
చంద్రబాబుపై రోజా నిప్పులు
పార్టీ ఫిరాయింపులను ఎన్టీఆర్ ముందు నుంచే వ్యతిరేకించారని, అలాంటిది ఇప్పుడు చంద్రబాబు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని రోజా విమర్శించారు. చంద్రబాబుకు మహానాడును నిర్వహించే అధికారం లేదన్నారు.
ఏపీ ప్రభుత్వం హత్యరాజకీయాలు ప్రోత్సహిస్తోందని, ఈ ప్రభుత్వంలో మహిళలకు భద్రత కూడా లేదని రోజా మండిపడ్డారు. చంద్రబాబుకు ఎన్టీఆర్ పేరు పలికే అర్హత లేదన్నారు.
రాయపాటి అసంతృప్తి.. మహానాడుకు డుమ్మా
నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు మహానాడుకు హాజరుకాలేదు. శనివారం అట్టహాసంగా మహానాడు ప్రారంభమైనా ఆయన మాత్రం రాలేదు. ఆదివారం కూడా గైర్హాజరయ్యారు. అయితే, ఆయన గైర్హాజరు వెనుక అసంతృప్తి ఉండవచ్చునని భావిస్తున్నారు.
పదవి చిచ్చు
రాయపాటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. టీటీడీ చైర్మన్ పదవి తన జీవితాశయమని చెప్పారు. ఆ పదవి కోసం అవసరమైతే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు.
హామీ లేదు.. సోమవారం వస్తారా? ఉత్కంఠ
ఈ పదవి కోసం ఆయన ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఓ లేఖ రాశారు. అయినప్పటికీ చంద్రబాబు నుంచి హామీ రాలేదు. దీంతో ఆయన అసంతృప్తికి లోనై హాజరు కాకపోయి ఉంటారని భావిస్తున్నారు. సోమవారం మహానాడుకు వస్తారా అనేది ఉత్కంఠగా మారింది.