బాబుకు రాజకీయంగా ప్రమాదం, కేఈదీ బాధ్యత: వైసిపి నేత హత్యపై రోజా
పత్తికొండ వైసిపి ఇంచార్జ్ నారాయణ రెడ్డి మృతి నేపథ్యంలో వైసిపి నాయకులు చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ముమ్మాటికి రాజకీయ హత్య అని ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు.
అమరావతి: పత్తికొండ వైసిపి ఇంచార్జ్ నారాయణ రెడ్డి మృతి నేపథ్యంలో వైసిపి నాయకులు చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ముమ్మాటికి రాజకీయ హత్య అని ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు.
గన్ లేదని, తరిమేసి.. ప్లాన్తో వైసిపి నేత హత్య, ముందే గుర్తించిన నారాయణరెడ్డి
ఇప్పుడు చంద్రబాబుకు రాజకీయంగా ప్రమాదం పొంచి ఉందని, అందుకే బలమైన ప్రత్యర్థులపై రాజకీయ కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు. తణుకులో ఎస్సైని నిర్బంధించే స్థాయిలో పాలన ఉందని రోజా మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో లా అండ్ ఆర్డర్ నాశనమయిందన్నారు.
అందుకే ఇలాంటి సంఘటనలు
సెటిల్మెంట్ ముఖ్యమంత్రి కాబట్టే ఏం చేసినా చంద్రబాబు అండగా ఉంటారనే సంకేతాలు పంపిస్తున్నారని ఆరోపించారు. తనకు ప్రాణహానీ ఉందని, గన్మెన్లు కావాలని వైసిపి నేతలు అడిగినా పట్టించుకోని పరిస్థితి అన్నారు. అందువల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు.
కేఈ బాధ్యత వహించాలి
ఈ ప్రమాదానికి ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కూడా బాధ్యత వహించాలని రోజా డిమాండ్ చేశారు. ఇది రాజకీయంగా మంచి పరిణామం కాదన్నారు. చంద్రబాబు తప్పు చేసిన వారిని వెంటనే శిక్షించాలన్నారు. చంద్రబాబు ఎలా ఉన్నారో, నేతలు అలాగే ఉన్నారన్నారు. గన్ లేదని తెలుసుకొని చంపేశారన్నారు.
గెలిచే సత్తా.. అందుకే హత్య చేశారు: ఐజయ్య
నారాయణ రెడ్డి హత్యకు చంద్రబాబు బాధ్యత వహించాలని వైసిపి నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య అన్నారు. చంద్రబాబు అండతోనే టిడిపి నేతలు రెచ్చిపోతున్నారన్నారు. చంద్రబాబు ఆదేశాలతో దౌర్జన్యాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచే సత్తా ఉన్న నారాయణ రెడ్డి అన్నారు. అందుకే అదను చూసి హత్య చేశారన్నారు.
టిడిపికి మనుగడ లేదు: బాలనాగిరెడ్డి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను చూడలేక టిడిపి దారుణానికి ఒడిగట్టిందని బాలనాగిరెడ్డి అన్నారు. టిడిపికి మనుగడ లేదన్నారు. ఈ హత్య బాధాకరమన్నారు.
ప్రశాంతంగా ఉన్న కర్నూలు జిల్లాలో హత్య రాజకీయాలకు తెరలేపారు
ప్రశాంతంగా ఉన్న కర్నూలు జిల్లాలో హత్యా రాజకీయాలకు తెరలేపారని గౌరు సుచరిత అన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక దాడులు, హత్యలు చేస్తున్నారన్నారు. వైసిపిని అణగదొక్కేందుకు దాడులు చేస్తున్నారన్నారు. అధికారుల అండతో ప్రత్యర్థులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ప్రాణాలకు ముప్పుందని నారాయణ రెడ్డి చెప్పినా భద్రత కల్పించడంలో విఫలమయ్యారన్నారు.