తమ బాగోతం బయటపడుతుందనే: అరాచకమంటూ రోజా ఫైర్
సభలో చర్చ జరిగితే తమ బాగోతం బయటపడుతుందనే భయం అధికార పక్షానికి పట్టుకుందని, అందుకే, అధికార పక్ష సభ్యులు ప్రతిసారి తమపై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా .
అమరావతి: సభలో చర్చ జరిగితే తమ బాగోతం బయటపడుతుందనే భయం అధికార పక్షానికి పట్టుకుందని, అందుకే, అధికార పక్ష సభ్యులు ప్రతిసారి తమపై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రోజా శుక్రవారం మాట్లాడారు.
ఏపీలో అరాచకం రాజ్యమేలుతోందని అన్నారు. ఓటుకు నోటు కేసు ఛార్జి షీటులో సీఎం చంద్రబాబు పేరు ప్రస్తావన, సుప్రీంకోర్టు నోటీసులపై చర్చించాలంటూ తాము వాయిదా తీర్మానం ఇస్తే, దానిపై చర్చించకుండా పక్కదోవ పట్టిస్తున్నారని రోజా మండిపడ్డారు.
ఆ కేసుపై మాట్లాడాల్సిన అవసరం లేదని ఒకరు, పక్క రాష్ట్రంలో జరిగిన దానిని తీసుకు వచ్చి ఏపీ అసెంబ్లీలో ఎలా మాట్లాడాతారని మరొకరు మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా, వైయస్ జగన్పై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ సభను అడ్డుకుంటున్నారని ఆమె విమర్శించారు. స్పీకర్ తమకు తండ్రి లాంటి వారని, ఆయనపై తమకు ఎంతో గౌరవం ఉందని అన్నారు.