నారాయణ ప్రొడక్షన్లో బోయపాటి డైరెక్షన్లో బాబు'బలి', పవన్ కళ్యాణ్ వల్లే: రోజా
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, టిడిపి ప్రభుత్వం పైన సోమవారం నిప్పులు చెరిగారు. అసెంబ్లీ మొదటిసారి వాయిదా పడిన అనంతరం వైసిపి ఎమ్మెల్యేలు మాట్లాడారు.
నారాయణ ప్రొడక్షన్లో, బోయపాటి డైరెక్షన్లో
రోజా మాట్లాడుతూ... సంతాపం సందర్భంగా అబ్దుల్ కలాం ఎక్కడ పుట్టారు, ఏ అవార్డులు అందుకున్నారో చెప్పినప్పుడు, గోదావరి పుష్కరాల మృతులు అక్కడకు ఎందుకు వచ్చారు, ఎలా చనిపోయారో చెప్పవద్దా అని ప్రశ్నించారు.
తాము గోదావరి పుష్కరాలకు అన్ని సదుపాయాలు కల్పించామని, పెద్ద ఎత్తున ప్రకటనలు చేశారని, అందుకే జనాలు వచ్చారన్నారు. గోదావరి పుష్కరాల ప్రమాదంపై రోజా మాట్లాడుతూ... నారాయణ ప్రొడక్షన్లో, బోయపాటి డైరెక్షన్లో చంద్రబాబు బలి అని ఎద్దేవా చేశారు.
పుష్కరాల సమయంలో చంద్రబాబు వీఐపీ ఘాట్లో స్నానం చేయకుండా, ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చే ఘాట్కు ఎందుకు వచ్చారన్నారు. మేడంకు (చంద్రబాబు సతీమణి) చేయికి గాయమైతే ఆమె ఎడమ చేతితో కాకుండా పక్కకు నిలబడి పూజలు చేయవచ్చు కదా అన్నారు.
యథా రాజా తథా ప్రజ
సభలో సంతాపాల మాట వద్దు, నేరస్తులకు శిక్ష పడాలని జగన్ చెబితే ఇంత రాద్దాంతం చేస్తారా అన్నారు. యథా రాజా తథా ప్రజా అన్నట్లుగా టిడిపి తీరు ఉందన్నారు. చంద్రబాబు లాగే బొండా ఉమ మాట్లాడుతున్నారన్నారు.
జగన్ కొత్తగా వచ్చాడని బొండ ఉమ చెబుతున్నారని, ఈయన అసెంబ్లీకి పదిసార్లు ఏమైనా వచ్చారా అన్నారు. ఎప్పుడొచ్చామన్నది ముఖ్యం కాదన్నారు. బొండా ఉమ తనయుడు ఓ మనిషిని గుద్ది చంపితే కేసు నుంచి తప్పించారన్నారు. వారికి మేం ఏం చేసినా తప్పుగానే కనిపిస్తుందన్నారు.
చర్చించేందుకు సిద్ధమంటున్నారు సరే.. ఇవన్నీ
చర్చించేందుకు తాము సిద్ధమని పదేపదే చంద్రబాబు, ప్రభుత్వం చెబుతోందని ఓటుకు నోటు, వనజాక్షి పైన దాడి, రిషికేశ్వరి ఆత్మహత్య, నారాయణ కళాశాలలో ఆత్మహత్య, గుంటూరులో పసిబిడ్డను ఎలుకలు కొరికి చంపిన ఘటనల పైన చర్చ జరగాలన్నారు.
గోదావరి పుష్కర ప్రమాదానికి చంద్రబాబే కారణమని, అలాంటి వ్యక్తి తమది బాధ్యత గల ప్రభుత్వం అనడం సిగ్గుచేటు అన్నారు. చంద్రబాబు చెప్పే దానికి, చేసే దానికి ఏమాత్రం సంబంధం లేదన్నారు.
జగన్ను తిరస్కరించారంటున్నారు సరే
జగన్ను ప్రజలు తిరస్కరించారని చంద్రబాబు చెబుతున్నారని, మరి పదేళ్ల పాటు అంతకుముందు మీరు ప్రతిపక్ష నేతగా ఉన్నారని గుర్తు చేశారు.
మోడీపై నమ్మకం, పవన్ కళ్యాణ్ ప్రచారం
2014 ఎన్నికల్లోను చంద్రబాబు తన సొంతగా గెలవలేదని, పవన్ కళ్యాణ్ ప్రచారం, ప్రధాని మోడీ పైన నమ్మకంతో గెలిచారన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కు, మోడీకి ఎందుకు భయపడుతున్నావని ప్రశ్నించారు.
హోదా గురించి మాట్లాడటం లేదని, ఓటుకు నోటు కేసు వంటి వల్ల కేసుల నుంచి తప్పించుకునేందుకు ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేయడం లేదన్నారు. హోదా పైన తీర్మానం చేద్దామని గత అసెంబ్లీలో జగన్ సూచిస్తే చంద్రబాబు మాట్లాడలేదని, ఇప్పుడు అందరూ హోదా కోసం నిలదీస్తున్నారన్నారు.
మీ వల్లే ఆత్మహత్యలు
ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యలు తమ వల్ల జరిగాయని చెబుతున్నారని, అసలు టిడిపి వల్లనే అవి జరిగాయన్నారు. హోదా విషయంలో చంద్రబాబు మళ్లీ ప్రజలకు అన్యాయం చేస్తున్నారన్నారు. కేసులను తప్పించుకునేందుకు ప్రజలకు అన్యాయం చేస్తున్నారన్నారు.
నాడు విభజనకు ముంది చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకొని విభజన జరిగేలా చేశారని రోజా ఆరోపించారు. ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి ఓటుకు నోటు కేసును తప్పించుకునేందుకు బిజెపి కాళ్ల వద్ద పడ్డారన్నారు.
కోడలు మగబిడ్డను కంటే అత్త వద్దంటుందా అని ఇటీవల చంద్రబాబు అన్నారని, అది మహిళలను చులకన చేయడమే అన్నారు.
ప్రత్యేక హోదా లేకుంటే ఎలా
ఏపీకి ప్రత్యేక హోదా రాకుంటే ఎలా అని రోజా ప్రశ్నించారు. హోదా ఏపీకి ఆక్సిజన్ వంటిది అన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, పరిశ్రమలు రావాలంటే హోదా కావాలన్నారు. హోదా కోసం నలుగురు చనిపోయింది వైసిపి వల్ల కాదని, మీ మంత్రులు, టిడిపి నేతల ప్రకటనల వల్లే అన్నారు. కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు.
పుష్కర ఘాట్ల ప్రమాదానికి కారణమైన చంద్రబాబు.. తమకు పదవులు ముఖ్యం కాదు, ప్రజలు ముఖ్యమని చెప్పడం విడ్డూరమన్నారు. చంద్రబాబు తన పైన విచారణ జరిపించుకోవాలన్నారు. నిజాలు చెప్పే తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే వదిలిపెట్టమన్నారు.