హుధుద్ విరాళాలు: టీడీపీని ఏకిపారేసిన రోజా
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, ప్రముఖ సినీ నటి రోజా తెలుగుదేశం పార్టీ పైన మండిపడ్డారు. హుధుద్ తుపాను కారణంగా టీడీపీ నేతలు లాభపడ్డారని ఆరోపించారు. హుధుద్ బాధితులకు 25 కేజీల బియ్యం సరఫరా చేశామంటూ వారు గొప్పలు చెప్పుకుంటున్నారని, రేషన్ షాపులో కిలో రూపాయికే అంద చేస్తున్నారన్నారు.
అలాంటప్పుడు 25 కేజీల బియ్యం ధర ఎంత అని ప్రశ్నించారు. బియ్యం రేషన్ షాపుల్లోంచి సరఫరా చేయరా అని నిలదీశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బస్సులో వారం రోజులు ఉన్నారని టీడీపీ నేతలు గుండెలు బాదుకుంటున్నారని, ఆయన ఉన్న బస్సు ఫైవ్ స్టార్ హోటల్లోని రూం కంటే అద్భుతంగా ఉంటుందన్నారు.
ప్రజలకు ఏం చేశారని తెలుగుదేశం పార్టీ నేతలను ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేకపోతున్నారన్నారు. హుధుద్ తుపాను విలయానికి చలించిన వేలాది మంది దాతలు చేసిన దానాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఆ డబ్బు ఎక్కడికి చేరిందో చెప్పాలన్నారు.
విశాఖలో తుపాను ధాటికి కూలిన చెట్లను తొలగించడం తప్ప ప్రభుత్వం ఏం చేసిందన్నారు. విద్యుత్ పరికరాలు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ఇచ్చాయని, రేడియో సెట్లు ఒరిస్సా ఇచ్చిందని, కార్మికులను తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు సమకూర్చాయని అలాంటప్పుడు ప్రభుత్వం ఏం చేసిందన్నారు.
పశ్చిమ బెంగాల్ నుంచి మమతా బెనర్జీ బంగాళాదుంపలు పంపిస్తే టీడీపీ నేతల ఇళ్లలో నిల్వ చేసుకున్నారని ఆరోపించారు. టీడీపీ నేతలు ప్రతిపక్షంపై విమర్శలు చేయడం కాదని, ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. విశాఖ ప్రజలు తుపాను బారినపడి పేదరికంలో మగ్గిపోతుంటే వారి పేరిట డబ్బు దండుకున్న టీడీపీ నేతలు డబ్బున్నవారుగా మారిపోయారన్నారు.