సిగ్గు లేకుండా.. బుర్ర లేక చెప్పారా.. : చంద్రబాబుపై రోజా తీవ్ర పదజాలం
చంద్రబాబుపై రోజా తీవ్రమైన పదజాలం వాడారు. సిగ్గు లేకుండా ఎలా అసెంబ్లీకి వస్తున్నారని, ఆ రోజు బుర్ర లేకుండా చెప్పారా అని ఆమె అడిగారు.
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు ఆర్కె రోజా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడ్డారు. తెలంగాణలోని ఓటుకు నోటు కేసును ప్రస్తావిస్తూ సిగ్గు లేకుండా చంద్రబాబు సభకు ఎలా వస్తున్నారని ప్రశ్నించారు.
వైసిపి సభ్యులు ఆందోళనతో గురువారం సభ కాసేపు వాయిదా వడిన తర్వాత ఆమె మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక హోదా వంటి విషయాలను ఆమె ప్రస్తావించారు. అసెంబ్లీలోని విజ్యువల్స్ బయటకు వెళ్లడంపై కూడా ఆమె వ్యాఖ్యలు చేశారు.
విభజన చట్టంలో ఉన్న కొన్నింటిని మాత్రమే ప్రత్యేక ప్యాకేజీ కింద ఇస్తున్నారని, మరి అన్నింటినీ ఎందుకు ఇవ్వడం లేదని రోజా ప్రశ్నించారు. అదే విభజన చట్టంలో ఉన్న ఎమ్మెల్యేల సీట్ల పెంపు గురించి రాజ్యంగ సవరణ చేయాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు నుంచి సీఎం చంద్రబాబు వరకు మాట్లాడుతున్నారని అంటూ అసెంబ్లీ సీట్ల పెంపుపై ఉన్న దృష్టి ప్రత్యేక హోదా రాబట్టకోవడంలో లేదా అని రోజా ప్రశ్నించారు.
కేంద్రాన్ని ప్రశ్నించలేకపోతున్నారు...
కేవలం 50మందికి అవసరమైన అసెంబ్లీ సీట్ల పెంపుపై ఆసక్తి ప్రదర్శిస్తున్న చంద్రబాబు వేలాది మంది నిరుద్యోగులు, కోట్లాది మంది ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన ప్రత్యేక హోదాను విస్మరిస్తున్నారని అన్నారు. ప్రత్యేక హోదా కోసం రాజ్యాంగ సవరణ ఎందుకు తేరని ఆమె అడిగారు.
ఆ కేసులో వాయిస్ తనదేనని తేలితే...
అగ్రిగోల్డ్ వ్యవహారంపై విచారణ చేయిస్తామని, ఆరోపణలు తప్పని తేలితే జగన్ సభకు రాకుండా ఉంటారా అని చంద్రబాబు అంటున్నారని. ఓటుకు నోటు కేసులో మీ వాయిస్ అని తెలిసిన తర్వాత కూడా అసెంబ్లీకి సిగ్గులేకుండా ఎలా వస్తున్నారని ఆమె ప్రశ్నించారు. ఆ వాయిస్ తనది కాదని చంద్రబాబు నిరూపించుకోవాలని రోజా డిమాండ్ చేశారు. ఒక వేళ నిజమని తేలితే రాజకీయ సన్యాసం చేస్తారా ఆమె చంద్రబాబును సవాల్ చేశారు.
అది రెండు చిప్పల సిద్ధాంతం..
ప్రత్యేక హోదా ముగిసిన విషయమని, ఇంకా చర్చలెందుకని అధికార తెలుగుదేశం పార్టీ సభ్యులంటున్నారని రోజా అంటూ ఆ రోజు సమైక్యాంధ్ర కోసం తాము పోరాడుతుంటే రెండు కళ్ల సిద్ధాంతం- రెండు చిప్పల సిద్ధాంతమని లేఖ ఇచ్చి రాష్ట్రాన్ని ముక్కులు చెక్కలు చేసి సర్వ నాశనం చేసింది సీఎం చంద్రబాబు నాయుడు కాదాప్రశ్నించారు.
ఆ రోజు బుర్ర లేక చెప్పారా...
ఎన్నికల ముందు ప్రత్యేక హోదా పదేళ్లు ఇవ్వాలని బిజెపి పట్టుబట్టిందని, పదిహేను సంవత్సరాలు తీసుకొస్తామని చంద్రబాబు చెప్పారని రోజా గుర్తు చేస్తూ ఇది నిజం కాదా అని ప్రశ్నించారు. మరి ఆ రోజు చంద్రబాబు బుర్రలేక చెప్పారా అని అన్నారు. ఆ తర్వాత హోదాపై అసెంబ్లీలో రెండు సార్లు ఏకగ్రీవ తీర్మానం ఎలా చేసి పంపారని రోజా గుర్తు చేశారు.
తప్పించుకోవడానికే ఇలా...
కేంద్రం కూడా హోదా ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతోంది, అందరం కలిసి పోరాడదాం అంటే మీరెందుకు భయపడుతున్నారని రోజా చంద్రబాబును ప్రశ్నించారు. కేంద్రంతో చంద్రబాబు లాలూచి పడ్డారని రోజా వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసులో తప్పించుకోవడం కోసం ఈ రాష్ట్ర ప్రజల గొంతుకోయడానికి చంద్రబాబు సిద్ధపడ్డారు కాబట్టే చర్చ జరగడానికి వీల్లేకుండా ఈ రోజు హోదాపై వాయిదా తీర్మానాన్ని డిసాల్వ్ చేశారని అన్నారు.