బాబుపై ద్వేషం లేదు: 'క్షమాపణ'పై రోజా మెలిక, వివాదం కొనసాగేనా?
హైదరాబాద్: తన సస్పెన్షన్, సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా మరోసారి గురువారం నాడు మెలిక పెట్టారు. రోజా క్షమాపణ చెప్పాలని, అలాగే ప్రభుత్వం అంగీకరించాలని సుప్రీం ఆదేశించింది. లేదంటే తామే విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.
సుప్రీం కోర్టు ఆదేశాల పైన రోజా స్పందించారు. అయితే, ఆమె మాట తీరును బట్టి క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది. తాను తన వ్యాఖ్యల పైన వివరణ ఇచ్చేందుకు సిద్ధమని రోజా చెప్పారు. కానీ క్షమాపణ చెబుతానని మాత్రం అనలేదు. దీంతో ఈ వివాదం ముగిసే అవకాశాలు కనిపించడం లేదు.
రోజా మాట్లాడుతూ... అసెంబ్లీలో అర్థవంతమైన చర్చ జరగాలన్నారు. ఇప్పటికైనా అందరూ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలన్నారు. తాను తన వ్యాఖ్యల పైన వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అలాగే ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించేందుకు ప్రతిపక్షానికి ఎక్కువ సమయం ఇవ్వాలని చెప్పారు.
కాల్ మనీ - సెక్స్ రాకెట్ గురించి తాను సభలో లేవనెత్తానని, మహిళల గురించి తాను పోరాడుతుంటే తనను సస్పెండ్ చేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్ను ప్రభుత్వం పథకం ప్రకారం ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. అధికార పార్టీ అసెంబ్లీలో మమ్మల్ని రెచ్చగొట్టేలా వ్యవహరించడం సరికాదన్నారు.
చంద్రబాబును తాను 'కామ సీఎం' అంటే తాను టిడిపి నేతలు బూతుగా ఫీల్ అవుతున్నారని, తాను దురుద్దేశ్యంతో ఆ వ్యాఖ్యలు చేయలేదని మొదటి నుంచీ చెబుతున్నానని అన్నారు. తనకు సస్పెన్షన్ ఆర్డర్ ఇవ్వకుంటే ఎలా అన్నారు. తనను వేధించారన్నారు.
తనను సస్పెండ్ చేసిన తర్వాత రోజు అసెంబ్లీకి వచ్చి స్పీకర్ను కలిసే ప్రయత్నం చేశానని చెప్పారు. కానీ మహిళను అని కూడా చూడకుండా తనను లాగి పడేశారని చెప్పారు. కోర్టు అడిగింది క్షమాపణ కాదని, వివరణ మాత్రమేనని చెప్పారు. చంద్రబాబుపై తనకు వ్యక్తిగత ద్వేషం లేదని చెప్పారు.