రోజమ్మ పరిస్థితి కుదుటపడుతోంది, నోట్ కూడా ఇవ్వనివ్వరా : జగన్
హైదరాబాద్: తమ పార్టీ శాసనసభ్యురాలు రోజా ఆరోగ్యం క్రమంగా కుదుట పడుతోందని, వైద్యులు చికిత్స అందిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. నిమ్స్లో చికిత్స పొందుతున్న రోజాను పరామర్శించిన తర్వాత ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.
హైబీపీతో ఉన్న రోజాకు వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇంతకు ముందు కూడా తిరుపతి స్విమ్స్లో 9 రోజుల పాటు అడ్మిట్ అయ్యారని ఆయన చెప్పారు. ఆ కేసు హిస్టరీ ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెప్పారని జగన్ అన్నారు.
ఇవాళ ఒక మహిళా ఎమ్మెల్యే శాసనసభకు వస్తే తమ పార్టీ కార్యాలయానికి వస్తే, ఆమె స్పీకర్ ఛాంబర్ వద్గకు వచ్చి ఒక నోట్ కూడా ఇవ్వగలిగే పరిస్థితి లేదని ఆయన అన్నారు. శాసనసభలోకి రాకూడదు గానీ కనీసం నోట్ కూడా ఇవ్వనివ్వలేదని ఆయన అన్నారు.
స్పీకర్కు అదే విషయాలు చెబుతూ రూల్ 340 ప్రకారం ఎమ్మెల్యేను ఏడాది పాటు ఇష్టం వచ్చినట్లు సస్పెండ్ చేసే అధికారం లేదని చెప్పామని, అసెంబ్లీ సమావేశాలు కొనసాగినంత కాలం మాత్రమే సస్పెండ్ చేసే అధికారం ఉందని, అదే రూల్ప్ వినిపించినా తమది అరణ్యరోదనే అవుతోందని ఆయన అన్నారు.
అధికార పక్షం ఏది చెప్తే అదే చేస్తామన్నట్లుగా తయారైందని ఆయన అన్నారు. అధికార తెలుగుదేశం పార్టీ రోజుకో వివాదాన్ని ముందుకు తెచ్చి ప్రజా సమస్యల మీద చర్చ జరగకూడదన్నట్లు వ్యవహరిస్తోందని విమర్సించారు.
అధికారంలో ఉన్నవాళ్లు తమకు నచ్చనివాళ్లను ఏడాది పాటు సస్పెండ్ చేయడం ప్రారంభిస్తే శాసనసభ మీద ప్రజలకున్న విశ్వాసం పోతుందని ఆయన అన్నారు. అసెంబ్లీలో ఇప్పుడున్నది రెండే పార్టీలని, బిజెపివాళ్లు సగం టిడీపి కండువాలు కప్పుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతిపక్షమంటే ప్రజల గొంతు అని, దాన్ని నొక్కేస్తున్నారని ఆయన అన్నారు. దేవుడు, ప్రజలు మొట్టికాయలు వేస్తారని ఆయన అన్నారు.
తమ దగ్గర బలం ఉంటే స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించి ఉండేవాళ్లమని ఆయన అనమ్నారు. తాము ఏదైనా అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిద్దామంటే అది నిలబడదు కాబట్టి ఊరుకుంటున్నామని చెప్పారు. కచ్చితంగా దాని మీద పోరాడుతామని, రూలింగ్ మీద కోర్టుకు కూడా వెళ్తామని జగన్ చెప్పారు.