బాలయ్య అమాయకుడు, పా..పం: రోజా వ్యంగ్యాస్త్రాలు, బాబు ప్రేమపై ఇలా..
ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన విమర్శలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా కౌంటర్ ఇచ్చారు.
కర్నూలు: ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన విమర్శలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా కౌంటర్ ఇచ్చారు. బాలకృష్ణ అమాయకుడని, ఆయన రాసిచ్చిందే చెప్పాడని రోజా అన్నారు. అంతేగాక, 'పా..పం' అంటూ ఎద్దేవా చేశారు.
ఓటు తూటాతో జగన్ పార్టీకి బుద్ధి చెప్పండి: శిల్పాపై బాలకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు
నంద్యాలలో రోజా..
రోజా బుధవారం నంద్యాల నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అఖిలప్రియ తన తండ్రిని చంపిన పార్టీలోకి వెళ్లి.. తమ పార్టీపై విమర్శలు చేయడం సరికాదని అన్నారు. అఖిలప్రియ తల్లి శోభానాగిరెడ్డి పీఆర్పీకి రాజీనామా చేసే వైయస్పార్ కాంగ్రెస్ పార్టీలో చేరారని రోజా గుర్తు చేశారు.
అయ్యోపాపం అనలేం..
భూమా నాగిరెడ్డి.. చంద్రబాబు ఒత్తిడి చేయడం వల్లే చనిపోయారని రోజా ఆరోపించారు. అయ్యో పాపం అంటూ భూమా కుటుంబంలోని ఎమ్మెల్యే అభ్యర్థికి ఓటు వేసే పరిస్థితి ఇప్పుడు లేదని అన్నారు. రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసిన చంద్రబాబుకు ఉపఎన్నికల్లో బుద్ధి చెప్పాలని అన్నారు.
వెన్నుపోటుదారుడు..
చంద్రబాబు మూడేళ్ల పాలనకు వ్యతిరేకంగా ఓటేయాలని రోజా ప్రజలకు పిలుపునిచ్చారు. చంద్రబాబు ఓ వెన్నుపోటుదారుడని విమర్శించారు. 600 హామీలిచ్చి ఒక్కటి కూడా నెరవేర్చని వ్యక్తి చంద్రబాబు అని అన్నారు.
ప్రజలపై బాబుకు ప్రేమ అప్పుడే..
ఎన్నికల సమయంలోనే ప్రజలను ప్రేమించే వ్యక్తి చంద్రబాబు అంటూ రోజా ఎద్దేవా చేశారు. ఏరు దాటేదాక ఏటి మల్లన్న.. దాటిన తర్వాత బోడి మల్లన్న అనేరకం చంద్రబాబు అంటూ మండిపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో, అండగా ఉంటున్నారని రోజా చెప్పారు.