పిచ్చిదాన్నా, జీవితంలో వదలను: జనసేనపై రోజా, హోంమంత్రి-రామోజీరావులపై..
తమ పార్టీ అధినేత జగన్ తనకు తక్కువేం చేయలేదని అలాగే, అసలు ఏమీ లేని జనసేన పార్టీలోకి వెళ్లడానికి తాను ఏమైనా పిచ్చిదానినా అని వైసిపి ఎమ్మెల్యే రోజా అన్నారు.
అమరావతి: తమ పార్టీ అధినేత జగన్ తనకు తక్కువేం చేయలేదని అలాగే, అసలు ఏమీ లేని జనసేన పార్టీలోకి వెళ్లడానికి తాను ఏమైనా పిచ్చిదానినా అని వైసిపి ఎమ్మెల్యే రోజా అన్నారు.
పవన్ కళ్యాణ్ పేరెత్తని షర్మిల, అందుకే: హోదాపై జగన్ దాటవేత, బిజెపికి దగ్గరేనా?
ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఆమె ఆదివారం రాత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా జనసేనలో చేరుతారనే ప్రచారం, రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి మద్దతు, జబర్దస్త్లో బూతు డైలాగులు.. తదితర అంశాలపై ఆమె స్పందించారు.
అసలు జగన్ను ఎందుకు వదలాలి
టిడిపి కాదంటే, జనసేనలోకి వెళ్తారని ప్రచారం జరుగుతోందని రోజాను ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. దానికి రోజా స్పందించారు. అసలు పవన్ కళ్యాణ్కు ఆయన పార్టీ ఎక్కడుందో, దానికి ఎవరు కమిటీయో, ఏమిటో కూడా తెలియని పరిస్థితుల్లో ఉందన్నారు. నేనేమీ అంత పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? పార్టీలు మారడానికి లేదా వెళ్లిపోవడానికి అన్నారు. అసలు తనకు జగన్ను వదిలి వెళ్లడానికి ఒక్క కారణం చెప్పాలని ఎదురు ప్రశ్నించారు. కొన్ని వార్తల కోసంచూపిస్తున్నారని, కొన్ని ఇమేజ్ను దెబ్బతీసేలా ఉన్నాయని, పార్టీ మారాలంటే ఎప్పుడో మారేదానిని అని, కానా రాజకీయంగా తనను తొక్కేస్తున్న సమయంలో ఓ సోదరుడిగా జగన్ తనకు రక్షణనిచ్చారని, జీవితంలో ఆయనను వదిలి వెళ్లే అవసరం లేదన్నారు. పార్టీలో చేరాక టిక్కెట్ ఇచ్చి, ఎమ్మెల్యేగా గెలిపించారని, తనకు ఓ గౌరవం ఇచ్చారన్నారు.
Recommended Video
నేను హోంమంత్రినా..
జగన్ ముఖ్యమంత్రి అయితే తాను హోం మంత్రిని అవుతానని వస్తున్న వార్తలపై కూడా రోజా స్పందించారు. తానేమీ అటువంటి కమిట్మెంట్లతో పని చేయడం లేదన్నారు. పార్టీలోకి వచ్చినప్పుడు కూడా టిక్కెట్ కోసం రాలేదని చెప్పారు.
అనిత రాజకీయాల్లోకి ఇప్పుడొచ్చారు
తాను వ్యక్తిగతంగా టిడిపి ఎమ్మెల్యే వంగలపూడి అనితను తిట్టలేదని రోజా చెప్పారు. చంద్రబాబు ఆమెను పావుగా వాడుకుంటున్నారన్నారు. అనిత ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారని, తాను పద్దెనిమిదేళ్ల క్రితమే వచ్చానని చెప్పారు. చంద్రబాబును తిట్టాల్సిన అవసరం తనకు లేదని, సీఎంగా ఉండి చేసే అన్యాయాల గురించి మాట్లాడుతున్నానని చెప్పారు.
చంద్రబాబు మనసులో ఏముందో?
తనను అసెంబ్లీలోకి రానిచ్చే విషయంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ మనసులో ఏముందో తనకు తెలియదని రోజా వ్యాఖ్యానించారు. ఈ విషయంలో తాను వేసిన పిటిషన్ పైన సుప్రీం కోర్టు కూడా స్పందించిందన్నారు. మహిళా కాంగ్రెస్ సమావేశాలకు తనను రమ్మని చెప్పి చివరి నిమిషంలో ఏం జరిగిందో తెలియకుండా, తనను కిడ్నాప్ చేసి, అటూ ఇటూ తిప్పి, చివరికి తెలంగాణలో వదిలేశారన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి మద్దతివ్వడంపై మాట్లాడుతూ.. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతిస్తే బిజెపితో లాలూచీ అంటారని, మీరా కుమార్కు మద్దతిస్తే పిల్ల కాంగ్రెస్, తల్లి కాంగ్రెస్ ఒక్కటి అంటారని వ్యాఖ్యానించారు.
జబర్దస్త్ ఒక్కటేనా, రామోజీ రావును అడగాలి
జబర్దస్త్లో ద్వంద్వార్థాలపై రోజా స్పందించారు. ఈ ప్రోగ్రాం ఈటీవీలో వస్తోందని, మరి రామోజీ రావును ఎందుకు అడగడరని ప్రశ్నించారు. మేం అక్కడ కేవలం జడ్జిలం మాత్రమేనని, దానికి నవ్వినా, నవ్వకపోయినా.. నవ్వే షాట్ వారు వేసుకుంటారన్న సంగతి మీకు తెలుసునని చెప్పారు. అదేమీ రియాల్టీ షో కాదన్నారు. ఈ విషయంలోను అందర్నీ వదిలేసి రోజాను టార్గెట్ చేయడం అంటే.. తనను చూసి భయపడ్డట్లే కదా అన్నారు. నేను ఎక్కడా బూతు డైలాగులు చెప్పలేదన్నారు. అలాగే, ఇలాంటి షోలు మరిన్ని ఉన్నాయని, దీని గురించే ఎందుకు మాట్లాడుతున్నారని అభిప్రాయపడ్డారు. దానికి పోటీగా వచ్చిన షోలు ఆగిపోయాయని, ఇది విజయవంతమైందన్నారు. అది ఒక తప్పుడు షో అయితే, రామోజీ రావు దానిని ఎంకరేజ్ చేయరని, ఈటీవికి ఉన్న బ్రాండ్ అటువంటిదని, అదే షో తప్పయితే శ్యాంప్రసాద్ రెడ్డి అన్ని కోట్లు ఖర్చు పెట్టి తీయరన్నారు.