మోడీపై నమ్మకం లేదా?: టిడిపి నేతలకు రోజా ప్రశ్న
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై ఏపి తెలుగుదేశం పార్టీ నేతలు ఎందుకు కలవరపడుతున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, నగరి ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్ ప్రజాసమస్యలపై ప్రధాని నరేంద్ర మోడీని కలిస్తే దాన్ని వక్రీకరించడం ఎంతవరకు సమంజసమని అన్నారు.
మీరు కలిసి పోటీ చేసిన భారతీయ జనతా పార్టీపైనే నమ్మకం లేదా, లేక మోడీపై మీకేమైనా అనుమానమా? అని సూటిగా ప్రశ్నించారు. దొడ్డిదారిన మంత్రి అయిన యనమల రామకృష్ణుడు.. వైయస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం వింతగా ఉందన్నారు.
పట్టిసీమ ప్రాజెక్టు బండారం బయటపడుతుందని తెలుగుదేశం నేతలకు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. పట్టిసీమ వల్ల ప్రయోజనం రాయలసీమకు కాదు.. ఏపి సిఎం చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేశ్ లకేనని రోజా ఆరోపించారు.
బిజెపిది బలుపు కాదు.. వాపే: సురవరం
భారతీయ జనతా పార్టీ సభ్యత్వం బలుపు కాదు వాపేనని సిపిఐ జాతీయ నేత సురవరం సుధాకర్ రెడ్డి ఆరోపించారు. ప్రధాని మోడీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షాలు మతోన్మాదం రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. బిజెపి విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్త పోరాటాలు చేస్తామని చెప్పారు.
బుధవారం ఆయన పార్టీ నేతలు నారాయణ, చాడ వెంకటరెడ్డితో కలిసి మాట్లాడారు. కేంద్రం ఇటీవల ఆమోదించిన భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా మే 14న దేశ వ్యాప్తంగా ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చే ఏపి వాహనాలకు పన్ను విధించడం వివాదాస్పద నిర్ణయమని చాడ వెంకటరెడ్డి విమర్శించారు.